Kishan Reddy: సింగరేణి కార్మికుల యూనిఫాంలో కిషన్ రెడ్డి.. ఆశ్చర్యపోయిన అధికారులు..

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సింగరేణి కార్మికుల యూనిఫాం ధరించి అందరినీ ఆశ్చర్యపర్చారు. శనివారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సింగరేణి సంస్థకు సంబంధించి అంశాలపై మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి సింగరేణి కార్మికుల యూనిఫాంలో కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఆయనను చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

Kishan Reddy: సింగరేణి కార్మికుల యూనిఫాంలో కిషన్ రెడ్డి.. ఆశ్చర్యపోయిన అధికారులు..
Kishan Reddy

Updated on: Jul 04, 2026 | 5:34 PM

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అందరినీ ఆశ్చర్యపర్చారు. సింగరేణి కార్మికుల యూనిఫాం ధరించారు. సింగరేణి కార్మికులు ధరించే నీలిరంగు యూనిఫాం ధరించి ఓ సమావేశానికి హాజరయ్యారు. దీంతో ఆయనను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కేంద్రమంత్రిగా కాకుండా ఒక సాధారణ వ్యక్తిలా ఈ యూనిఫాంలో కిషన్ రెడ్డి కనిపించారు. ఈ డ్రెస్‌లో ఆయనను చూసి అధికారులు షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను కిషన్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. అసలు కిషన్ రెడ్డి సింగరేణి యూనిఫాం ఎందుకు ధరించారో తెలుసా..? అందుకు గల కారణం ఏంటి? అనే విషయాలు చూద్దాం.

హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సింగరేణి సంస్థకు సంబంధించిన కీలక అంశాలపై శనివారం సమీక్ష జరిగింది. సింగరేణి సమస్యలు, ఇతర అంశాలపై ఈ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన కిషన్ రెడ్డి.. సింగరేణి కార్మికుల నీలిరంగు యూనిఫామ్ ధరించి వచ్చారు. దీనిపై తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కిషన్ రెడ్డి టీమ్ పోస్ట్ పెట్టింది. “సింగరేణి కార్మికుల నీలిరంగు యూనిఫామ్ ధరించి హాజరవడాన్ని గర్వంగా భావిస్తున్నాను. ఇది కేవలం యూనిఫామ్ మాత్రమే కాదు. ఇది సింగరేణి కార్మికుల చెమట చుక్కను ప్రతిబింబించే త్యాగం, వారి శ్రమ, ధైర్యం అంకితభావానికి ప్రతీక. బొగ్గు కార్మికుల సమస్యలపై ఏ సమావేశానికి వెళ్లినా ఆయా బొగ్గు కంపెనీల్లో కార్మికులు ధరించే యూనిఫామ్ ధరించే సాంప్రదాయాన్ని నిరంతరం కొనసాగిస్తున్నందుకు నాకెంతో సంతృప్తి కలుగుతుంది. దేశ ఇంధన భద్రతకు నిరంతరం అండగా నిలుస్తున్న ప్రతి సింగరేణి కార్మికుడికి నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. జై సింగరేణి, జై తెలంగాణ” అంటూ పేర్కొన్నారు.

ఈ సమావేశంలో అధికారులకు కిషన్ రెడ్డి పలు ఆదేశాలు జారీ చేశారు. బొగ్గు రంగంలో సంస్కరణలు, బొగ్గు వాయువు ఉత్పత్తి వంటి కొత్త కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, పోటీలో నిలదొక్కుకోవాలంటే ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తి నిబద్ధత, సామర్థ్యం, ​​జవాబుదారీతనంతో పనిచేయాలని నొక్కిచెప్పారు. కొత్త బ్లాక్‌లను దక్కించుకోవడానికి మానవ వనరుల గరిష్ట వినియోగం, సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడం, క్రమబద్ధమైన ప్రణాళిక అవసరమని ఉద్ఘాటించారు. బొగ్గు ఉత్పత్తి సింగరేణికి ప్రధాన బలమని పునరుద్ఘాటించి, నాణ్యతా ప్రమాణాలను పెంచాల్సిన అవసరముందని తెలిపారు.పటిష్టమైన, సుస్థిరమైన, స్వయం సమృద్ధిగల బొగ్గు రంగం కోసం ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని, ప్రాజెక్టుల సకాల అమలును నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు.

Follow Us