Amit Shah: పటేల్‌ పరాక్రమం వల్లే రాష్ట్రానికి విముక్తి.. పవర్‌లోకి రాగానే అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంః అమిత్ షా

|

Sep 17, 2021 | 4:56 PM

భారత తొలి హోంమంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్‌ పరాక్రమం వల్లే హైదరాబాద్‌ రాష్ట్రానికి విమోచనం సాధ్యమైందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు.

Amit Shah: పటేల్‌ పరాక్రమం వల్లే రాష్ట్రానికి విముక్తి.. పవర్‌లోకి రాగానే అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంః అమిత్ షా
Amit Shah In Nirmal
Follow us on

Amit Shah in Nirmal Sabha: భారత తొలి హోంమంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్‌ పరాక్రమం వల్లే హైదరాబాద్‌ రాష్ట్రానికి విమోచనం సాధ్యమైందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. నిర్మల్‌లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ విమోచన దినోత్సవ సభలో అమిత్‌ షా ముఖ్యఅతిథిగా పాల్గొని రాష్ట్ర ప్రజలకు విమోచన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత తెలంగాణకు స్వేచ్ఛ లభించిందన్నారు. అమిత్‌షా నిర్మల్‌ సభ వేదికగా సమరశంఖం పూరించారు. ఎంఐఎం నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై మీ ఆగడాలు సాగవ్ అంటూ తేల్చేశారు. మజ్లిస్‌ను ఓడిస్తేనే తెలంగాణకు అసలైన స్వేచ్ఛ అన్నారు షా. ఇక్కడ నినదిస్తే… రిసౌండ్ హైదరాబాద్‌లో రావాలన్నారు. మజ్లిస్‌తో పోరాటం ఒక్క బీజేపీతోనే సాధ్యమని చెప్పారు.

అలాగే, అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా జరుపుతామన్నారు. కర్ణాటకలో హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుతున్నామని షా స్పష్టం చేశారు. స్వరాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతామన్న కేసీఆర్‌ హామీలు ఏమయ్యాయన్నారు. తెలంగాణ విమోచన వీరుల బలిదానాలు కేసీఆర్‌కు పట్టవా? అని అమిత్‌ షా ప్రశ్నించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌, ఇతర భాజపా నేతలు పాల్గొన్నారు.

తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. నిర్మల్‌ జిల్లా రాంజీ గోండు స్మారక స్థూపం దగ్గర ఈ సభను నిర్వహించారు. నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం జరిగిన ప్రదేశంలోనే ఈ సభ నిర్వహిస్తూ సెంటిమెంటును రాబట్టే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. నిజాం పాలన కింద ఉన్న హైదరాబాద్‌ రాష్ట్రం 1956తర్వాత మూడు ముక్కలైంది. ఓ భాగం మహారాష్ట్రలో కలవగా.. మరికొంత కర్నాటకలో కలిసింది. మిగిలినది ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంతమైంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం విమోచన దినోత్సవం కాకుండా సెప్టెంబర్‌ 17ని విలీనం జరిగిన రోజుగా భావిస్తోంది. కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజుని విమోచన దినోత్సవంగా జరుపుతుంటే.. తెలంగాణ ప్రభుత్వం జరపకపోవడం దారుణమంటూ విమర్శలు చేస్తున్నారు బీజేపీ నేతలు. రజాకార్ల అరాచకాలు, నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన రాంజీ గోండు, కొమురం భీమ్‌ను స్మరిస్తూ ఈ సభ సాగింది.

Read Also…  Bandi Sanjay: ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం ప్రజలు కదిలి రావాలి.. నిర్మల్ వేదికగా పిలుపునిచ్చిన బండి సంజయ్