
చెప్పులే కదా తీసి పారేయలేము.. వాటికి చాలా విలువ ఉంది.. అందుకే ఆలయాలు, ఆసుపత్రులు, మరెక్కడైనా బయట చెప్పులు విడిచి వెళతాము.. ఎవరైనా ఎత్తుకు పోతారని కొందరు జాగ్రత్తగా చూసుకుంటారు. ఇపుడు ఆ చెప్పుల వ్యవహారం ఇద్దరు మహిళలు మధ్య గొడవ జరిగి.. చివరికి కొట్టుకునే వరకు దారితీసింది.
సాధారణంగా ఆసుపత్రి అంటే రోగులు, వారి సహాయకులతో నిశ్శబ్దంగా ఉండాలి. కానీ, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రి మాత్రం ఒక్కసారిగా రణరంగంగా మారింది. ప్రాణాలు కాపాడే చోట.. కేవలం చెప్పుల మీద నీళ్లు పడ్డాయన్న చిన్న కారణంతో ఇద్దరు మహిళలు వీధి పోరాటానికి దిగడం చర్చనీయాంశమైంది.
సత్తుపల్లి పట్టణంలో కొత్తగా నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రి ప్రారంభోత్సవ పనులతో ఆ ప్రాంతమంతా సందడిగా ఉంది. అదే సమయంలో స్థానిక ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ కేంద్రం (MCH) వద్దకు వచ్చిన ఇద్దరు మహిళల మధ్య చిన్నపాటి వివాదం మొదలైంది. ఒక మహిళ విడిచిన చెప్పుల మీద, మరో మహిళ పొరపాటున నీళ్లు పోయడమే ఈ గొడవకు ప్రధాన కారణం.
చెప్పులపై నీళ్లు ఎలా పోస్తావు అంటూ మొదలైన వాదన, క్షణాల్లోనే రణరంగంగా మారిపోయింది. ఒకరినొకరు అసభ్య పదజాలంతో దూషించుకున్నారు. అంతటితో ఆగకుండా, ఆవేశంతో ఊగిపోయిన ఆ మహిళలు జుట్టు పట్టుకుని పరస్పరం దాడులు చేసుకున్నారు. ఆసుపత్రి ఆవరణలోనే సినిమా సీన్ తరహాలో ఒకరినొకరు కింద పడేసి కొట్టుకుంటుంటే, అక్కడున్న రోగులు, వైద్య సిబ్బంది విస్తుపోయి చూశారు.
ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి వారిని విడదీసే ప్రయత్నం చేసినప్పటికీ, ఆ మహిళలు ఎవరి మాట వినే పరిస్థితిలో లేరు. సెక్యూరిటీ కళ్ళెదుటే మళ్ళీ మళ్ళీ దాడులకు దిగారు. గొడవ ముదురుతుండటంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరు మహిళలను సముదాయించి, కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడి నుండి పంపించి వేశారు. ఆసుపత్రి వంటి పవిత్రమైన చోట ఇలాంటి చిన్న కారణాల కోసం గొడవ పడటం సరికాదని పోలీసులు మందలించారు. ఈ గొడవ మొత్తాన్ని అక్కడున్న కొందరు తమ సెల్ఫోన్లలో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కారణం ఏదైనా, ఈ ఘటన సత్తుపల్లిలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
వీడియో ఇక్కడ చూడండి…
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..