
హైదరాబాద్లో మరో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని బాలికలు, యువతులను మోసం చేస్తున్నాడు ఓ కామాంధుడు. పవన్ అలియాస్ తరుణ్ అనే యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరు నెలల వ్యవధిలో అతనిపై రెండు పోక్సో కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా మైనర్ బాలికలకు పరిచయం ఏర్పరచుకుని ప్రేమ పేరుతో వారిని నమ్మించి మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో అతను మూడు నెలలుగా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చివరకు ఓ స్నేహితుడి ఇన్స్టాగ్రామ్ పోస్టు ఆధారంగా అతని ఆచూకీ గుర్తించి బంజారాహిల్స్లో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
దర్యాప్తులో భాగంగా నిందితుడు ఐదుగురు యువతులతో ప్రేమ వ్యవహారాలు కొనసాగించినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మరో యువతిని వివాహం చేసుకున్న తర్వాత కూడా మోసాలకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. నిందితుడికి గతంలో చోరీలు, స్నాచింగ్ కేసుల్లోనూ నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన ప్రొఫైల్లతో యువతులను లక్ష్యంగా చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కొంతకాలంగా చర్చనీయాంశమైన ‘రిచ్ కిడ్’ తరహా మోసాల కేసుల మాదిరిగా నిందితుడి వ్యవహార శైలిని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అరెస్టు చేసిన పవన్ను కోర్టులో హాజరుపరిచి, తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..