
ట్రాక్టర్ పై సినిమా స్టైల్లో స్టంట్స్. జాతీయ రహదారి 44 పై విన్యాసాలు అంటూ టీవీ9 లో వచ్చిన కథనాలపై జోగులాంబ గద్వాల జిల్లాలోని మనోపాడు పోలీసులు స్పందించారు. జాతీయర రహదారిపై ప్రమాదకరంగా ట్రాక్టర్ డ్రైవింగ్ చేసిన వ్యక్తిని పట్టుకొని పీఎస్కు తీసుకొచ్చారు. డ్రైవర్తో పాటు ట్రాక్టర్ యజమానికి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి ఇలాంటి స్టంట్ లు చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఎస్సై చంద్రకాంత్ హెచ్చరించారు.
వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల క్రితం జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడ్ నుండి ఉండవల్లి మండల వెళ్లే జాతీయ రహదారిపై ఓ యువకుడు ట్రాక్టర్ పై సాఫీగా పడుకొని డ్రైవింగ్ చేసుకుంటూ హల్చల్ చేశాడు. యువకుడి ప్రమాదకర డ్రైవింగ్ను చూసిన సదరు వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ అంశాన్ని గమనించిన టీవీ9 ప్రతినిధి.. సదరు స్టంట్ లను వీడియో చిత్రీకరించి ఆఫీస్కు పంపాడు. దీంతో ఆ యువకుడు జాతీయ రహదారిపై ఈ ప్రమాదకర స్టంట్లు చేస్తూ డ్రైవింగ్ చేయడం టీవీ9 ఇస్మార్ట్ న్యూస్లో ప్రసారం అయ్యింది.
ఇక టీ9లో ప్రసారం అయిన కథనాలపై స్పందించిన జిల్లా పోలీసులు జాతీయ రహదారిపై స్టంట్లు చేస్తూ హల్చల్ చేసిన వ్యక్తి కోసం గాలింపు చేపట్టి ఎట్టకేలకు అతన్ని పట్టుకున్నారు. ఈ స్టంట్స్ చేసిన వ్యక్తి ఉండవల్లి మండలం పుల్లూరు గ్రామానికి చెందిన రామకృష్ణగా గుర్తించారు. ట్రాక్టర్ డ్రైవింగ్ చేసిన రామకృష్ణతో పాటు ట్రాక్టర్ ఓనర్ను అదుపులోకి తీసుకొని మానోపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ వారిద్దరి కౌన్సిలింగ్ ఇచ్చి మరోసారి ఇలాంటి స్టంట్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటానని ఎస్సై చంద్రకాంత్ తెలిపారు.
ఇదిలా ఉండగా జిల్లాలోని యువతకు ఎస్సై చంద్రకాంత్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. రామకృష్ణలా మరెవరూ రోడ్లు మీద స్టంట్ లు చేయవద్దని, సోషల్ మీడియా రీల్స్ కోసం ఎవరైనా రోడ్లమీద బైక్లు, ట్రాక్టర్లు, కార్లతో విన్యాసాలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..