
తెలంగాణ రోడ్డు రవాణ సంస్థ ఎప్పటికప్పుడు కొంగొత్త నిర్ణయాలతో ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే పలు రకాల సేవలను ప్రారంభించిన ఆర్టీసీ తాజాగా హైటెక్ బస్సులను రంగంలోకి దింపుతోంది. తొలి విడతగా 16 ఏసీ స్లీపర్ బస్సులు ఇప్పటికే హైదరాబాద్కు చేరుకున్నాయి. ప్రైవేటు బస్సులో ఉండే దాదాపు అన్ని ఫీచర్లు ఈ బస్సుల్లో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు, హుబ్లీ, విశాఖపట్నం, తిరుపతి, చెన్నైలో ఈ బస్సులు నడవనున్నాయి.
సోమవారం ఉదయం 9.30 గంటలకు ఈ కొత్త ఏసీ స్లీపర్ బస్సులను తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అంజయ్ కుమార్ ప్రారంభించనున్నారు. లహరి పేరుతో తీసుకొచ్చిన ఈ ఏసీ స్లీపర్ బస్సులకు అత్యాధునిక సాంకేతికను జోడించారు. ప్రయాణికుల భద్రతకు పెద్ద పీట వేస్తూ.. ట్రాకింగ్ సిస్టంతో పాటు పానిక్ బటన్ సదుపాయాన్ని కల్పించారు. వీటిని టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేశారు.
మొత్తం 12 మీటర్ల పొడవు ఉంటే ఏసీ స్లీపర్ బస్సుల్లో… 15 లోయర్ బెర్త్లు, 15 అప్పర్ స్లీపర్ బెర్త్లు ఉంటాయి. బెర్త్ల వద్ద మొబైల్ చార్జింగ్, రీడింగ్ ల్యాంప్ సౌకర్యం ఉంటుంది. వీటితో పాటు బస్సుల్లో ఉచిత వై-ఫై సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. సెక్యూరిటీ కెమెరాలతో పాటు, రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరాను కూడా అందించారు. వీటితో పాటు అత్యాధునికమైన ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టంను ప్రత్యేకంగా అందించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..