ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఘోర ప్రమాదం.. వడ్లు ఆరబెట్టే యంత్రంలో చిక్కుకున్న మహిళా కూలీ తల!

అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించే ధాన్యం కొనుగోలు కేంద్రం ఒక పేద కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. పని కోసం వెళ్లిన చోట యంత్రం రూపంలో మృత్యువు కబళించడంతో ఒక మహిళా కూలీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. క్షణాల్లోనే తల యంత్రంలోకి వెళ్లడంతో తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఘోర ప్రమాదం.. వడ్లు ఆరబెట్టే యంత్రంలో చిక్కుకున్న మహిళా కూలీ తల!
Paddy Drying Machine Accident

Edited By:

Updated on: May 13, 2026 | 11:20 AM

సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలంలోని ఆకునూరు ఐకేపీ (IKP) కేంద్రంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కాశగుడిసెల గ్రామానికి చెందిన షేక్ ఇమాంబీ (50) ఉపాధి కోసం ఈ కేంద్రానికి కూలీ పనికి వెళ్లారు. అక్కడ ధాన్యం ఆరబెట్టే ప్రక్రియలో భాగంగా నూర్పిడి యంత్రం వద్ద ఆమె విధుల్లో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో వేగంగా తిరుగుతున్న మిషన్ బెల్టులో ఆమె తల వెంట్రుకలు ఒక్కసారిగా చిక్కుకున్నాయి. అజాగ్రత్తగా ఉండటం, యంత్రం వేగంగా తిరుగుతుండటంతో క్షణాల్లోనే ఆమె తల యంత్రం లోపలికి లాగబడింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఇమాంబీ అక్కడికక్కడే కన్నుమూశారు.

మృతురాలు ఇమాంబీ కుటుంబం ఇప్పటికే అనేక కష్టాల్లో ఉంది. నాలుగు సంవత్సరాల క్రితమే ఆమె కుమారుడు గుండెపోటుతో మరణించగా, ఆ బాధ నుండి కోలుకోకముందే ఇప్పుడు ఇంటి ఇల్లాలు ప్రాణాలు కోల్పోవడంతో భర్త, ఇద్దరు కుమార్తెలు దిక్కులేని వారయ్యారు. తోటి కూలీలు యంత్రాన్ని ఆపి కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అయితే, కొనుగోలు కేంద్రాల్లోని యంత్రాలకు తగిన రక్షణ కవచాలు (Safety guards) లేకపోవడం, రక్షణ చర్యలు పాటించకుండా యంత్రాలను నడపడం వల్లే ఇమాంబీ ప్రాణాలు కోల్పోయిందని తోటి కూలీలు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us