Hyderabad: హైదరాబాదులో వర్షం కురిసినా.. గంటలపాటు ట్రాఫిక్ స్తంభించకుండా ప్రణాళిక

| Edited By: Surya Kala

Sep 23, 2024 | 8:21 PM

హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. వరుసగా కురుస్తున్న భారీ వర్షాల సమయంలో రోడ్లపై ముఖ్య కూడళ్ల వద్ద పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోతుంది. ట్రాఫిక్ కంట్రోలింగ్ కోసం తక్షణ స్పందన అవసరమని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీని కోసం అన్ని శాఖలతో సమన్వయం చేసుకునేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.

Hyderabad: హైదరాబాదులో వర్షం కురిసినా.. గంటలపాటు ట్రాఫిక్ స్తంభించకుండా ప్రణాళిక
Traffic Jam In Hyderabad
Follow us on

హైదరాబాదులో వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రతిరోజు గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోతుంది. ముఖ్యంగా సాయంత్రం సమయంలో గంటల తరబడి ట్రాఫిక్ లోనే వాహనదారులు గడపాల్సి వస్తుంది. దీంతో హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నగర పోలీసు కమిషనర్ సి.వి. ఆనంద్ , మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ దానా కిషోర్, జీహెచ్ఎంసీ, హైడ్రా, హెచ్‌ఎమ్‌డిఎ, రాచకొండ , సైబరాబాద్ పోలీసు అధికారులతో కలిసి ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

వరుసగా కురుస్తున్న భారీ వర్షాల సమయంలో రోడ్లపై ముఖ్య కూడళ్ల వద్ద పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోతుంది. ట్రాఫిక్ కంట్రోలింగ్ కోసం తక్షణ స్పందన అవసరమని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీని కోసం అన్ని శాఖలతో సమన్వయం చేసుకునేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఈ సమావేశంలో అన్ని విభాగాల సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవడం, ముఖ్య కూడళ్ల వద్ద డైవర్షన్లు అమలు చేయడం, వాతావరణ సూచనలు, ట్రాఫిక్ సలహాలను వేగంగా అందించడం, సమాచార ఫలకాలు అమలు చేయడం, నీటి నిల్వలను నివారించడంతో పాటు రహదారి పై నీరు నిల్వ ఉండకుండా ప్రవాహాన్ని మెరుగుపరచడానికి ఇంజినీరింగ్ మార్పులు చేయడం వంటి అంశాలను చర్చించారు.

ప్రతీ విభాగం తమ ప్రాంతాలలో ఇప్పటికే చేపడుతున్న చర్యలను, ఉన్న ప్రణాళికలను వివరించగా, ట్రాఫిక్‌ను తగ్గించేందుకు తక్షణం అవసరమైన దీర్ఘకాలిక ప్రణాళికలను చర్చించారు. ఉమ్మడి వర్క్‌షాప్ నిర్వహించడం మూడు పోలీస్ కమిషనరేట్‌ల ట్రాఫిక్ కమిషనర్, జీహెచ్ఎంసీ సహా ఇతర విభాగాలతో కూడిన ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయడం, ఐటీ కంపెనీలతో సమన్వయం, టెక్నాలజీని ఉపయోగించడం, అన్ని విభాగాల కోసం ఒక సాధారణ సమాచార వేదికను రూపొందించడం వంటి అంశాలను చర్చించారు.

ఇవి కూడా చదవండి

ఈ సమావేశంలో అదనపు సీపీ (లా అండ్ ఆర్డర్) శ్రీ విక్రమ్ సింగ్ మన్, జీహెచ్ఎంసీ కమిషనర్ శ్రీమతి అమ్రపాలి కాటా, హెచ్‌ఎమ్‌డిఎ కమిషనర్ శ్రీ సర్ఫరాజ్ అహ్మద్, హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్, హైదరాబాదు ట్రాఫిక్ అదనపు సీపీ శ్రీ పీ.విశ్వ ప్రసాద్, రాచకొండ సీపీ శ్రీ జి.సుధీర్ బాబు, సైబరాబాద్ సీపీ శ్రీ అవినాష్ మహంతి, మూడు పోలీస్ కమిషనరేట్‌ల చీఫ్‌లు, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ సహా ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..