Adilabad: టైగర్ టెర్రర్.. 3 జిల్లాలను వణికిస్తున్న పులి.. భయంతో బిక్కుబిక్కుమంటున్న స్థానికులు..

|

Nov 17, 2022 | 9:57 AM

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరో సారి టైగర్ టెన్షన్ పెడుతోంది. ఊరు, పొలాలు అని తేడా లేకుండా దాడి చేస్తుండటంతో 8 మండలాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. పులి దాడిలో ఓ వ్యక్తి చనిపోవడంతో ఈ భయం..

Adilabad: టైగర్ టెర్రర్.. 3 జిల్లాలను వణికిస్తున్న పులి.. భయంతో బిక్కుబిక్కుమంటున్న స్థానికులు..
Tiger Tension
Follow us on

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరో సారి టైగర్ టెన్షన్ పెడుతోంది. ఊరు, పొలాలు అని తేడా లేకుండా దాడి చేస్తుండటంతో 8 మండలాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. పులి దాడిలో ఓ వ్యక్తి చనిపోవడంతో ఈ భయం మరింత బలంగా మారింది. రాత్రిళ్లు నిద్ర పోకుండా ఆరుబయట కాపలా కాస్తున్నారు. పులి సంచారం విషయాన్ని తెలుసుకున్న అటవీశాఖ అధికారులు మ్యాన్ ఈటర్ కోసం వేట కొనసాగుతున్నారు. కొమురంభీం జిల్లా ఖానాపూర్ గ్రామ శివారులో సిడాం భీమును పులి దాడి చేసి చంపేసింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. 20 మంది ప్రత్యేక అటవీశాఖ టీంతో ట్రాకింగ్ చేస్తున్నారు. 35 కెమెరాలు, 50 మంది టైగర్ ట్రాకర్స్ తో పులి సంచార ప్రాంతాల్లో అణువణువునా గాలిస్తున్నారు. ఖానాపూర్, గోవిందపూర్, చౌపన్ గూడ అటవీ ప్రాంతాల్లో మరోసారి స్థానికులకు పులి కనిపించడంతో భయంతో వణికిపోతున్నారు. మూడు జిల్లాలు, 8 మండలాలు, 18 గ్రామాలను‌ బెబ్బులి ముప్పు తిప్పలు పెడుతోంది.

ఖానాపూర్ లో ఓ వ్యక్తిపై దాడి చేయడంతో పులి సంచార గ్రామాల్లో భయం మరింత పెరిగింది. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల జిల్లాల్లో పులి తిరుగుతోంది. కొమరంభీం జిల్లా వాంకిడి మండలం ఖానాపూర్ గ్రామంలో సిడాం భీం ను చంపిన పులి.. అప్పటి నుంచి కనిపించకుండా పోయింది. తాజాగా దగేహాం మండలం ఖర్జి గ్రామంలో పశువుల మందపై పంజా విసింది. భీంపూర్ , తాంసి , జైనథ్ మండలాల పరిదిలోని పెనుగంగ తీరం వెంట ఏకంగా నాలుగు పులులు సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పాదముద్రల ఆధారంగా పులా కాదా అన్నది గుర్తించలేకపోతున్నట్లు ఆసిఫాబాద్ అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే తప్ప పులి దాడి అని పక్కాగా చెప్పలేమంటున్నారు. దీంతో అటవీ శాఖ తీరుపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా.. శ్రీరాంపూర్‌ పులి సంచారం కలకలం రేపింది. దీంతో ఒక్కసారిగా శ్రీరాంపూర్‌ గ్రామస్థులు, గని సమీపంలోని సింగరేణి కార్మికుల్లో భయాందోళన నెలకొంది. ఈ విషయం శ్రీరాంపూర్‌ పోలీసులకు తెలవడంతో ఎస్సై మానస ఆ ప్రాంతంలో పులి జాడ కోసం అన్వేషిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎలాంటి పులి ఆనవాళ్లు కనిపించలేదని చెబుతున్నారు. ప్రజలు భయాందోళన చెందవద్దని, పులిని త్వరలోనే పట్టుకుంటామని అధికారులు, పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..