
వేలకు వేలు.. లక్షలకు లక్షలు లంచాలను తీసుకునే పోలీసులను చూసి ఉంటారు.. ప్రభుత్వం నుంచి వచ్చే జీతభత్యాలు సరిపోదన్నట్లు అమ్యామ్యాలతోనే పబ్బం గడుపుకునే అధికారులనూ చూసే ఉంటారు.. అడ్డూ అదుపు లేకుండా మనలను ఎవరు అడుగుతారులే అన్నట్లు బరితెగించి సామాన్య ప్రజల దగ్గర అంతకంతా డబ్బులు గుంజే సంఘటనలు కూడా చూసి ఉంటారు. కానీ, ఇక్కడ సాక్షాత్తూ ఓ ట్రాఫిక్ సీఐ తన కింది సిబ్బందిపై లంచాల విషయంలో ఫిర్యాదు చేశాడు. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా ఇది అక్షరాలా నిజం.. ఉంటారులెండి ఇలా నిజాయితీగా ఉద్యోగం చేసుకునేవాళ్లు ఎక్కడో అక్కడ అని ఈ సంఘటన గురించి తెలిశాక ఖచ్చితంగా అనిపిస్తుంది.
హైదరాబాద్ నగరం పాతబస్తీ ప్రాంతంలో కింది సిబ్బందిపై చార్మినార్ ట్రాఫిక్ సీఐ వీరశంకర్ ఫిర్యాదు చేశాడు. అదేదో ఫిర్యాదు అంటే తన పరిధిలో విధులు సరిగా నిర్వర్తించడం లేదనో.. లేక పై అధికారిగా తనకు తగినంత గౌరవం ఇవ్వడం లేదనో కాదు, తన సిబ్బంది లంచాలకు అలవాటు పడ్డారని. అసలు ఆ మాత్రం చేతికి అందుతుందంటేనే నీకెంత.. నాకెంత అని పంచుకునే పోలీసులు ఉన్న ఇప్పటి రోజుల్లో ఇంత నిజాయితీగా తన వృత్తి ధర్మాన్ని పాటిస్తున్న సీఐ వీరశంకర్ గురించి ఎంతైనా నేర్చుకోవచ్చు. పాతబస్తీ పరిధిలో విధులు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీసులు వచ్చేపోయే వాహనదారులను నిలువరిస్తూ బండి పత్రాలు లేవనో.. వాహనం సరైన కండిషన్లో లేదనో ఆరోపిస్తూ సామాన్యుల వద్ద డబ్బులు లాగుతున్నారు. ఇది గత కొన్ని రోజులుగా స్థానిక ప్రజలకు, ఆ పరిధిలో ప్రయాణించే వాహనదారులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తోంది.
ఈ విషయం తన దృష్టికి చేరడంతో చార్మినార్ ట్రాఫిక్ సీఐ వీరశంకర్.. ఎలాగైనా ఈ అక్రమాన్ని అరికట్టాలని ఆలోచించాడు. ముందుగా తన కింది సిబ్బందిగా విధులు నిర్వరిస్తున్న హోంగార్డ్ రమేష్ను ఇలాంటి పనులు మానుకోమని హెచ్చరించాడు. వినకపోతే వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుందని గట్టిగానే చెప్పి చూశాడు. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. చట్టాన్ని, న్యాయాన్ని కాపాడాల్సిన బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉండి.. ఇలా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ వారి వద్దే డబ్బులు లాగే అక్రమ కార్యకలాపాలను అరికట్టాలని ఉద్దేశంతో తన కింది సిబ్బందిపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు లంచాలకు అలవాటు పడిన హోంగార్డ్ రమేష్ను చార్మినార్ లా అండ్ ఆర్డర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..