Telangana: తెలంగాణలో ఈ బస్సులు బంద్.. తక్షణమే ఆదేశాలు అమల్లోకి.. టీజీఎస్ఆర్టీసీ బిగ్ అనౌన్స్మెంట్..
తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ప్రమాదాల క్రమంలో జేబీఎమ్ సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ బస్సులను తాత్కాలికంగా నిలిపివేసింది. అన్ని డిపోల పరిధిలో ఈ సంస్థకు చెందిన బస్సు కార్యకలాపాలను నిలిపివేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు ఈ బస్సు సర్వీసులు ఆగిపోనున్నాయి.

నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రామ్ కింద తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో నడుస్తున్న జేబీఎమ్ ఎలక్ట్రిక్ బస్సులలో వరుసగా హై వోల్టేజ్ బ్యాటరీ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల పరిధిలో తిరిగే జేబీఎమ్ సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ బస్సుల కార్యకలాపాలను తాత్కాలిక నిలిపివేతకు యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. గత నెల జూన్ 21వ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు కరీంనగర్ సమీపంలో అలుగునూర్ వద్ద జరిగిన బస్సు అగ్ని ప్రమాదంపై పూర్తి నివేదిక రాకముందే.. మరొక సంఘటన జరగడం వలన ప్రయాణీకులు, సిబ్బంది, ప్రజల ప్రాణాల రక్షణే అత్యంత ప్రాధాన్యతగా భావించి తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
తెలంగాణ ఆర్టీసీ జేబీఎం సంస్థను ప్రమాదాల విశ్లేషణ నివేదిక, శాశ్వత నివారణ చర్యలు, బ్యాటరీ ఫిట్నెస్ సర్టిఫికేషన్, హైదరాబాద్ బస్సు భవన్లో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు, భద్రతకు సంబంధించిన పలు అంశాలపై స్పందించి తగు నివేదిక సమర్పించాల్సిందిగా కోరింది. ఆర్టీసీ ఆదేశాలతో జేబీఎమ్ సంస్థ తక్షణమే నివేదికలు సిద్ధం చేసేందుకు టెక్నికల్ టీంను రంగంలోకి దింపింది. చైనా నుంచి బ్యాటరీ నిపుణుల బృందం కూడా ప్రమాద పరిస్థితులకు దారి తీసిన సందర్భాలను పరిశీలిస్తోంది. భద్రతా ప్రమాణాలు, సంబంధిత నివేదికలను ఆర్టీసీ ఉన్నతాధికారుల బృందం క్షుణ్ణంగా పరిశీలించనుంది. సంస్థ నిర్దేశించిన అన్ని షరతులను జేబీఎమ్ యాజమాన్యం పూర్తిగా పాటించినట్లు సంతృప్తి చెందిన తర్వాత ఆర్టీసీ నిర్ణయం తీసుకోనుంది. జేబీఎమ్ టెక్నికల్ బృందం వెహికల్ ఫిట్ ఫర్ ఆపరేషన్ అని ధృవీకరించిన వాహనాల పునరుద్ధరణపై తుది నిర్ణయం తీసుకోనుంది. ప్రజారవాణాలో భద్రత విషయంలో టీజీఎస్ ఆర్టీసీ ఎటువంటి రాజీ పడదని, ప్రయాణీకులు సురక్షితంగా ప్రయాణించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని టీజీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది.
