
విద్యుత్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది.. నిజాం కాలం నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ విద్యుత్ శాఖ ఎలాంటి నిర్ణయాలు తీసుకుందనేది ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా వేదికగా టీజీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పవర్ ఎగ్జిబిషన్–2026.. విద్యార్థులు, యువత, వినియోగదారులు, సాధారణ ప్రజలకు విశేష ఆకర్షణగా నిలుస్తోంది. విద్యుత్ వినియోగం, భద్రత, సాంకేతిక పరిణామాలు, విద్యుత్ రంగ చరిత్రపై అధికారులు విద్యార్థులకు ఎన్నో విషయాలు తెలిపారు.
ముఖ్యంగా విద్యుత్ వినియోగ విధానాలు, విద్యుత్ భద్రతా ప్రమాణాలు, విద్యుత్ పొదుపు మార్గాలు, పునరుత్పాదక ఇంధన వనరులు, స్మార్ట్ మీటరింగ్ వ్యవస్థలు, ఆధునిక విద్యుత్ పంపిణీ సాంకేతికతలు, విద్యుత్ రంగంలో చోటుచేసుకున్న మార్పులు వంటి అంశాలను ప్రజలకు వివరంగా తెలియజేస్తున్నారు. విద్యార్థులు ,యువత విద్యుత్ వ్యవస్థ పనితీరు, దాని ప్రాముఖ్యతను ప్రత్యక్షంగా తెలుసుకునేలా ప్రత్యేక నమూనాలు, ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
అలాగే హైదరాబాద్ విద్యుత్ వ్యవస్థకు సంబంధించిన 120 ఏళ్ల చారిత్రక ప్రస్థానాన్ని ప్రత్యేక గ్యాలరీ రూపంలో సందర్శకులకు పరిచయం చేస్తున్నారు. నిజాం పాలనలో ప్రారంభమైన విద్యుత్ సేవల నుంచి నేటి డిజిటల్, స్మార్ట్ గ్రిడ్ ఆధారిత విద్యుత్ పంపిణీ వ్యవస్థ వరకు జరిగిన పరిణామాలను చిత్రాలు, నమూనాలు, చారిత్రక పత్రాలు ,సమాచార ప్రదర్శనల ద్వారా వివరిస్తున్నారు.
ఈ పవర్ ఎగ్జిబిషన్ ద్వారా విద్యుత్ చరిత్ర, వినియోగం, భద్రత, భవిష్యత్ సాంకేతికతలపై ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించడమే లక్ష్యమని టీజీఎస్పీడీసీఎల్ అధికారులు తెలిపారు. చారిత్రక వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆధునిక విద్యుత్ భవిష్యత్తు వైపు TGSPDCL ముందుకు సాగుతోందని అధికారులు పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.