
తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. కొద్ది రోజులుగా రవాణా శాఖ అమలు చేస్తున్న సంస్కరణలను మరింత కఠిన తరం చేసేలా రవాణా శాఖ ఉన్నత స్థాయి అధికారులు సిద్ధం అయ్యారు. రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించి మరణాల రేటును నివారించే విధంగా అధికారులు పని చేసేందుకు ప్లాన్ సిద్ధం చేశారు. ఇందుకోసం ఎన్ఫోర్స్మెంట్ వేగవంతం చేయడానికి ఇటీవల రవాణా శాఖలో 33 జిల్లా స్థాయి బృందాలు, మూడు రాష్ట్రస్థాయి ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసింది. ఇందులో డీటీసీ, ఆర్టీఏ ఇతర అధికారులు నిరంతరం ఇందులో తనిఖీలు చేపడుతున్నారు.
తనిఖీలు ఏ బృందం ఎక్కడ చేపడుతుంది.. అనేదానిపై ముందస్తు సమాచారం లేకుండా ప్రతి రోజు ఉదయం 6 గంటలకి ఆయా బృందాలకు సమాచారం అందించి తనిఖీలు చేపట్టింది. గత 10 రోజుల వ్యవధిలో తనిఖీలు చేపట్టడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన 4,748 కేసులు నమోదు చేశారు. మొత్తం 3420 వాహనాలు సీజ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మరింత తనిఖీలు ముమ్మరం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారుల ఆదేశించారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు ఓవర్ లోడ్ వల్లే అధికంగా జరుగుతుండడంతో దాని మీద ఎక్కువగా దృష్టి సారించారు. ఓవర్ లోడ్ అయిన వాహనాలు సీజ్ చేయడంతో పాటు, రెండోసారి ఓవర్ లోడ్ తో వాహనం పట్టుబడితే ఆ వాహనం పర్మిట్ రద్దు చేయడంతో పాటు, వాహనం నడుపుతున్న డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేసేలా చర్యలు తీసుకోనున్నారు. అయితే ఓవర్ లోడ్ పై మైనింగ్ శాఖతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడైతే వాహనాల లోడింగ్ జరుగుతుందో అక్కడే నివారించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులకు తాజా ఆదేశాలిచ్చింది.
హెవీ వెహికల్ డ్రైవర్ కి లైసెన్సు రెన్యువల్ సమయంలో పునఃశ్చరణ తరగతులు ఏర్పాటు చేసేలా కార్యాచరణ చేస్తున్నారు. రోడ్డు నిబంధనలు అతిక్రమిస్తున్న సమాచారాన్ని ప్రజల నుండి సమాచారం వచ్చిన వెంటనే.. రవాణా శాఖ అధికారులు స్పందించేలా ప్లాన్ చేస్తున్నారు. గత సంవత్సరం నిర్వహించిన రోడ్డు భద్రత మాసోత్సవం మంచి ఫలితాలు ఇచ్చిందని ఈ సారి జనవరిలో జరిగే రోడ్డు భద్రత మాసోత్సవాలపై ఇప్పటినుంచే కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్.. ఇందులో విద్యార్థులు, డ్రైవర్లు, కార్మికులు, పోలీసులు, అధికారులు భాగస్వామ్యం ఉండేలా ఇప్పటి నుండి అవగాహన కల్పించాలని తెలిపారు.
పాఠశాల నుండి కాలేజీ వరకు వ్యాసరచన పోటీలు, రోడ్డు నిబంధనపై నాటకాలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఇందులో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండేలా చేసి ప్రమాదాలు తగ్గించి మరణాల రేటు నివారించేలా కార్యాచరణ తీసుకోవాలని రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. రవాణా శాఖలో పెండింగ్ లో ఉన్న ఖాళీల భర్తీ చేయడంతో పాటు , ప్రమోషన్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పది రోజులకు ఒకసారి ఎన్ఫోర్స్మెంట్ పై సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని ఆదేశించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..