
ప్రజలకు మెరుగైన, సులభమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుండి కొత్తగా కొనుగోలు చేసే నాన్-ట్రాన్స్పోర్ట్ మోటార్ సైకిళ్లు, మోటార్ కార్లకు, మొదటి రిజిస్ట్రేషన్ సమయంలో వాహనాన్ని RTO కార్యాలయానికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు. కేంద్ర మోటారు వాహన నియమాలు, 1989 లోని నియమం 48-B ప్రకారం, అధికారిక ఆటోమొబైల్ డీలర్ ద్వారా కొనుగోలు చేసిన వాహనాలకు ఈ సౌకర్యం వర్తిస్తుందని రవాణా శాఖ పేర్కొంది.
ఈ కొత్త విధానం ప్రకారం వాహనం కొనుగోలు చేసిన అధికారిక డీలర్నే శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేస్తారు. అవసరమైన పత్రాలు (ఇన్వాయిస్, ఫారం–21, ఫారం–22, బీమా, చిరునామా రుజువు, వాహన ఫోటోలు మొదలైనవి) డీలర్ ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరుుతుంది. రవాణా శాఖ అధికారి దరఖాస్తును పరిశీలించి, రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) నేరుగా స్పీడ్ పోస్ట్ ద్వారా వాహన యజమానికి పంపడం జరుగుతుంది.
ఈ విధానం అమలుతో ప్రజలకు, సమయం ఆదా అవుతుందంటున్నారు రవాణా శాఖ అధికారులు. అంతేకాదు RTO కార్యాలయాలకు వెళ్లే అసౌకర్యం తగ్గుతుంది. వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా పూర్తవుతుంది. అవసరమైతే రవాణా శాఖ అధికారులు అధికారిక ఆటోమొబైల్ డీలర్ల వద్ద వాహనాలపై యాదృచ్ఛిక తనిఖీలు నిర్వహిస్తారు. దీని వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ సౌకర్యం ప్రైవేట్ బైక్లు, కార్లకు మాత్రమే వర్తిస్తుంది. ట్రాన్స్పోర్ట్ వాహనాలకు ఇది వర్తించదు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలకు మరింత సులభమైన, డిజిటల్, సమర్థవంతమైన రవాణా సేవలను అందించడంలో ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తుందంటున్నారు అధికారులు. రవాణా శాఖలో దళారుల వ్యవస్థకు చెక్ పెట్టవచ్చని రవాణాశాఖ అధికారులు అంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..