
తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ అకునూరి మురళి నేతృత్వంలోని బృందం తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ 2026 విజన్ ఫర్ ఇంక్లూజివ్ ఎక్సలెన్స్ పేరుతో రూపొందించిన సమగ్ర నివేదికను సమర్పించింది. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వరరావు, డాక్టర్ చారకొండ వెంకటేష్, జ్యోత్స్న శివారెడ్డి పాల్గొన్నారు.
కీలక ప్రతిపాదనలు ఇవే:
2,000 పాఠశాలల ఆధునీకరణ: రాష్ట్రంలోని 2,000 పాఠశాలలను ప్రయోగశాలలు, లైబ్రరీలు, క్రీడా సౌకర్యాలతో కూడిన సమగ్ర విద్యా సంస్థలుగా మార్చాలని కమిషన్ ప్రతిపాదించింది. ప్రతి స్కూల్లో సుమారు 1,500 మంది విద్యార్థులకు వసతులు ఉంటాయి.
స్కూల్ బస్సు నెట్వర్క్: దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థుల కోసం అంకితమైన స్కూల్ బస్సు నెట్వర్క్ను ఏర్పాటు చేసి, గ్రామాలను, బస్తీలను పాఠశాలలతో అనుసంధానిస్తారు.
బడ్జెట్ కేటాయింపు: ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి, రాబోయే ఆర్థిక సంవత్సరంలోనే వీటికి అవసరమైన బడ్జెట్ను కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
సమగ్ర సంస్కరణలు: ప్రీ-స్కూల్ నుండి యూనివర్సిటీ స్థాయి వరకు మొత్తం 12 అధ్యాయాలతో కూడిన ఈ నివేదికలో సాంకేతిక విద్య, ఓపెన్ లెర్నింగ్, పాలనాపరమైన సంస్కరణలపై కీలక సిఫార్సులు ఉన్నాయి. ఈ పాలసీ తయారీ కోసం విద్యా కమిషన్ గత 14 నెలలుగా తీవ్రంగా శ్రమించింది . రాష్ట్రవ్యాప్తంగా 305 విద్యా సంస్థలను సందర్శించి క్షేత్రస్థాయి పరిశీలన చేసింది నివేదికను రెడీ చేసింది.
పంజాబ్, హర్యానా, కేరళ వంటి రాష్ట్రాలతో పాటు మలేషియా, వియత్నాం, అమెరికా వంటి దేశాల్లోని ప్రభుత్వ పాఠశాలల పనితీరును అధ్యయనం చేసింది. తల్లిదండ్రుల సంఘాలు, టీచర్ యూనియన్లు, విద్యావేత్తలు, గ్లోబల్ ఎక్స్పర్ట్స్తో అనేక దఫాలుగా చర్చలు జరిపి ఈ నివేదికను సిద్ధం చేసింది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను తెలంగాణ బిడ్డలకు అందించడమే లక్ష్యంగా ఈ నూతన విద్యా విధానాన్ని అమలు చేయబోతున్నారు.
Telangana Education Reforms
మరిన్ని కెరీర్ అండ్ ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.