Revanth Reddy: ఏం జరగనుంది..? సడెన్‌గా ఆ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..

అసలేం జరుగుతోంది...? ఏం జరగబోతోంది..? బీఆర్ఎస్‌ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు షాక్‌ ఇస్తూ ఇప్పటికే స్పీకర్‌ నోటీసులు పంపగా... ఇప్పుడా ఎమ్మెల్యేలను రేవంత్‌ రెడ్డి కలవడం హాట్‌ టాపిక్‌గా మారింది. జంపింగ్‌ ఎమ్మెల్యేల విషయంలో రేవంత్‌ వ్యూహం ఏంటన్న దానిపై పొలిటికల్‌ సర్కిల్‌లో హాట్‌హాట్‌ డిబేట్స్‌ నడుస్తున్నాయ్.

Revanth Reddy: ఏం జరగనుంది..? సడెన్‌గా ఆ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..
Revanth Reddy

Updated on: Sep 08, 2025 | 8:01 AM

ఒక్కరు.. ఒకే ఒక్కరు తప్పా.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. కడియం శ్రీహరి మినహా బీఆర్ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు తీర్పు, స్పీకర్‌ నోటీసులపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి కూడా హాజరయ్యారన్న సమాచారంతో అసలేం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ నేతలు. ఇక విచారణ జరిపిన ధర్మాసనం పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించింది. ఫిరాయింపు పిటిషన్లను సంవత్సరాల తరబడి పెండింగ్‌లో పెట్టడం సమంజసం కాదని.. పార్టీ ఫిరాయింపులకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని సూచించడంతో స్పీకర్ గడ్డం ప్రసాద్‌ పదిమంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపారు. ఆ నోటీసులకు ఇప్పటికే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సమాధానం ఇవ్వగా… మిగిలిన వారి ఆన్సర్‌ కోసం స్పీకర్‌ చూస్తున్న టైమ్‌లో రేవంత్‌తో ఎమ్మెల్యేల భేటీ ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ఇప్పటికే స్పీకర్ నోటీసులకు స్పందించి… పార్టీ మారలేదని చెప్తూ వస్తున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మరోమారు తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పారు. కేసీఆర్‌ను గౌరవించేవారిలో తాను మొదటి వ్యక్తినన్న ఆయన… ఇప్పటివరకు బీఆర్ఎస్‌ పార్టీ లైన్‌ దాటలేదన్నారు. తానెప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని, ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నానని కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు.

అయితే.. మిగిలిన తొమ్మిది మందిలో కడియం శ్రీహరి మినహా మిగిలిన ఎమ్మెల్యేలంతా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయినట్లు తెలుస్తోంది..

మొత్తంగా… పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో కీలక పరిణామాల చోటుచేసుకున్న నేపథ్యంలో.. రేవంత్‌ సమావేశం ఉత్కంఠ రేపుతోంది. సీఎం ఏం చేయబోతున్నారు…? ఎలాంటి వ్యూహాలు రచించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..