Balanagar Flyover: అందుబాటులోకి వచ్చిన బాలానగర్‌ ప్లై ఓవర్‌.. మున్సిపల్ కార్మికురాలితో రిబ్బన్ కట్ చేయించిన మంత్రి కేటీఆర్

|

Jul 06, 2021 | 12:51 PM

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌. సిగ్నల్‌ ఫ్రీ సిటీగా మార్చేందుకు మరో ముందడుగు పడింది. బాలానగర్‌ ప్లై ఓవర్‌ ప్రారంభమైంది.

Balanagar Flyover: అందుబాటులోకి వచ్చిన బాలానగర్‌ ప్లై ఓవర్‌.. మున్సిపల్ కార్మికురాలితో రిబ్బన్ కట్ చేయించిన మంత్రి కేటీఆర్
Balanagar Flyover Inauguated By Minster Ktr
Follow us on

Balanagar Flyover Inauguated by Minster KTR: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌. సిగ్నల్‌ ఫ్రీ సిటీగా మార్చేందుకు మరో ముందడుగు పడింది. బాలానగర్‌ ప్లై ఓవర్‌ ప్రారంభమైంది. హైద‌రాబాద్ మహా న‌గ‌రంలో మ‌రో ఫ్లై ఓవ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది. బాలాన‌గ‌ర్ చౌర‌స్తాలో నిర్మించిన ఫ్లై ఓవ‌ర్‌ను రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ మంగ‌ళ‌వారం ప్రారంభించారు. బాలానగర్ బిడ్జి రిబ్బెన్ కటింగ్ మున్సిపల్ కార్మికురాలితో చేయించారు మంత్రి కేటీ రామారావు.

2017 ఆగస్టు 21న బాలానగర్‌ ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. అయితే, మంగళవారం గ్రాండ్‌ ఓపెనింగ్‌ కోసం ఏర్పాట్లు చేశారు. మంత్రులు తలసాని, మల్లారెడ్డిలతో కలిసి మంత్రి కేటీఆర్‌ ప్రారంభించాల్సి ఉంది. మంత్రి చేతుల మీదుగానే ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, ఎవరూ ఊహించని రీతిలో మంత్రి కేటీఆర్‌ అందరికీ సడెన్‌ షాక్‌ ఇచ్చారు. ఫ్లై ఓవర్ నిర్మాణంలో ఇంత కాలం పనిచేసిన శివమ్మ అనే మహిళా కార్మికురాలి చేత రిబ్బన్ కట్ చేయించారు. మంత్రి చేయించిన ఈ ఓపెనింగ్ చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎంతగొప్పగా ఆలోచించారు మంత్రి కేటీఆర్‌ అంటూ అందరూ సంతోషం వ్యక్తం చేశారు.

ఈ బ్రిడ్జికి ఒక ప్రత్యేకత ఉంది. రూ.385 కోట్లతో మూడున్నరేళ్ల వ్యవధిలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు.  హైదరాబాద్‌ నగరంలోని అతి ప్రధాన రహదారుల్లో ఒకటి, 6 లేన్లతో సిటీలోనే నిర్మించిన మొట్ట మొదటి బ్రిడ్జి ఇది కావడం విశేషం. 2050 సంవత్సరం వరకు ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని నిర్మాణం చేశారు. దీనికి బాబూ జగజ్జీవన్‌రామ్‌ బ్రిడ్జిగా నామకరణం చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. అంతకుముందు ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డికి స్థానిక మహిళలు బోనాల‌తో ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.


బాలానగర్ ఫ్లై ఓవ‌ర్‌ ప్రత్యేకతలు…

ఈ ఫ్లై ఓవ‌ర్‌ను మూడు సంవ‌త్సరాల 11 నెల‌ల స‌మ‌యంలో పూర్తి చేశారు. అత్యాధునిక ఫ్రీకాస్ట్‌ టెక్నాలజీని వినియోగించి 1.13 కిలోమీటర్ల దూరం.. 24 మీటర్ల వెడల్పుతో రూ. 387 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జిని ఆరు లేన్లతో నిర్మించారు. వంతెనపై బీటీరోడ్డు వేయడంతో పాటు మధ్యలో డివైడర్‌ సైతం ఏర్పాటు చేశారు. వాటిలో చక్కటి పూల మొక్కలు నాటారు. ఎల్‌ఈడీ వీధిలైట్లు అమర్చారు. ఈ వంతెనతో ట్రాఫిక్‌ కష్టాలు తీరడమే కాదు.. ఈ ప్రాంతం మీదుగా సికింద్రాబాద్‌-కూకట్‌పల్లి-అమీర్‌పేట-జీడిమెట్ల వైపునకు రాకపోకలు సాగించే వారికి వెసులుబాటు కలుగుతుంది. ముఖ్యంగా నర్సాపూర్‌ చౌరస్తాగా ప్రసిద్ధి గాంచిన బాలానగర్‌ చౌరస్తా వాహనాల రాకపోకలకు ఎంతో కీలకం. హైదరాబాద్ మహానగరంలో 6 లేన్లతో సిటీలోనే నిర్మించిన మొట్ట మొదటి బ్రిడ్జి ఇది. భారీ ఫ్లై ఓవర్ల నిర్మాణంలో ఎంతో అనుభవం ఉన్న హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఈ ఫ్లై ఓవర్‌ పనులను చేపట్టింది.