TS High Coourt: కొనసాగుతున్న కృష్ణానది జల విద్యుదుత్పత్తి వివాదం.. విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు

|

Jul 06, 2021 | 1:55 PM

కృష్ణానది జల విద్యుదుత్పత్తి వివాదంపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమాకోహ్లి ధర్మాసనమే విచారణ చేపట్టాలని తెలంగాణ అడ్వొకేట్‌ జనరల్‌ ప్రసాద్ కోరారు.

TS High Coourt: కొనసాగుతున్న కృష్ణానది జల విద్యుదుత్పత్తి వివాదం.. విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు
Telangana High Court
Follow us on

Telangana High Court hearing the Krishna waters dispute: కృష్ణానది జల విద్యుదుత్పత్తి వివాదంపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమాకోహ్లి ధర్మాసనమే విచారణ చేపట్టాలని తెలంగాణ అడ్వొకేట్‌ జనరల్‌ ప్రసాద్ కోరారు. నదీ జలాల అంశం రోస్టర్‌ ప్రకారమే సీజే ధర్మాసనానికి వస్తుందని టీఏజీ తెలిపింది. ప్రస్తుతం విచారణ జరుపుతున్న ధర్మాసనానికి సమాచారం ఇవ్వాలని జస్టిస్‌ రామచంద్రరావు బెంచ్‌కు ఏజీ తెలిపారు.

ప్రస్తుతం విచారణ జరుపుతున్న న్యాయమూర్తి ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి, బెంచ్‌ మార్చాలని ఏజీ కోరారని పిటిషనర్లు తెలిపారు. పిటిషన్‌పై విచారణ చేపట్టాక మళ్లీ అభ్యంతరాలేంటని జస్టిస్‌ రామచంద్రరావు బెంచ్‌ ప్రశ్నించింది. ఏజీ తీరు దురదృష్టకరం అని జస్టిస్‌ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. ఈ విషయంపై సీజే నుంచి స్పష్టత తీసుకొని నిర్ణయం చెబుతామని ధర్మాసనం తెలిపింది.

రోస్టర్‌పై అభ్యంతరాలను రామచంద్రరావు బెంచ్‌ దృష్టికి తీసుకెళ్లాలని సీజే హిమాకోహ్లి చెప్పినట్లు బెంచ్‌కు తెలంగాణ అడ్వొకేట్‌ జనరల్‌ వివరించారు. ఇరువైపులా లాయర్లు గందరగోళం సృష్టిస్తున్నారని సీజే హిమాకోహ్లి అసహనం వ్యక్తం చేశారు. న్యాయమూర్తులకు ఉద్దేశాలు ఆపాదించడం తగదని సీజే హిమాకోహ్లి హితవు పలికారు. న్యాయమూర్తిపై అభ్యంతరాలుంటే పిటిషన్‌ వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేశారు. దీంతో మధ్యంతర పిటిషన్ వెనక్కి తీసుకుంటానని ఏజీ తెలిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వెంకటరమణపైనా సీజే అసహనం వ్యక్తం చేశారు. ఫలానా బెంచ్‌ కావాలని కోరడం పద్ధతి కాదని తెలిపారు. ఏ బెంచ్‌ విచారణ చేపట్టాలో తానే నిర్ణయిస్తానని సీజే వివరించారు.

కృష్ణా బేసిన్‌లో పూర్తి స్థాయి జలవిద్యుదుత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం జూన్‌ 28న జారీ చేసిన జీవో 34ను సవాలు చేస్తూ కృష్ణా జిల్లాకు చెందిన రైతులు జి.శివరామకృష్ణప్రసాద్‌, ఎం.వెంకటప్పయ్యలు తెలంగాణ హైకోర్టులో నిన్న లంచ్‌ మోషన్‌ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

Read Also….  Road Accident: సఖినేటిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. అంతర్వేది రథం దగ్ధం కేసులో అనుమానితుడు మృతి..!