
హైదరాబాద్, జనవరి 22: తెలంగాణ రాష్ట్ర గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి హైకోర్టు తీర్పు మళ్లీ వాయిదా పడింది. తీర్పు కాపీ సిద్ధం కాలేదని, ఫిబ్రవరి 5న తుది తీర్పు వెల్లడించనున్నట్లు గురువారం (జనవరి 22) డివిజన్ బెంచ్ వెల్లడించింది. టీజీపీఎస్సీ గ్రూప్ 1 నియామకాలపై గతంలో సింగిల్ బెంచ్ స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై టీజీపీఎస్సీతో పాటు, గ్రూప్ 1 పోస్టులకు ఎంపికైన పలువురు అభ్యర్థులు డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. ఆ అప్పీళ్లను విచారన జరిపిన ధర్మాసనం స్టే ఎత్తి వేసింది. గతంలోనే విచారణ పూర్తి చేసింది కూడా. నియామకాలు తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని విచారణ సమయంలో తెలిపింది. అనేక మలుపులు తిరిగిన గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్లో ఇప్పటికే నియామకాలు కూడా పూర్తయ్యాయి. మొత్తం 562 మందికి రేవంత్ సర్కార్ నియామక పత్రాలు సైతం అందజేసింది. దీనిపై తీర్పు ఈ రోజు వెలువడాల్సి ఉండగా.. ఫిబ్రవరి 5వ తేదీకి అది వాయిదా పడింది.
టీజీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని, తిరిగి మూల్యాంకనం చేయాలని పలువురు అభ్యర్ధులు హైకోర్టులో పిటీషన్లు వేశారు. విచారణ జరిపిన సింగిల్ బెంచ్ పారదర్శకత లోపించిందన్న కారణంతో గ్రూప్ 1 మార్కుల తుది జాబితా, జనరల్ ర్యాంకులను రద్దు చేసింది. ఫలితాలు రద్దుచేసి, తిరిగి మూల్యాంకనం చేయాలని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. జవాబుపత్రాలను పునర్ మూల్యాంకనం చేయలేనిపక్షంలో మళ్లీ పరీక్షలు నిర్వహించాలని సింగిల్ జడ్జి తీర్పు వెలువరించింది. అయితే ఆ తీర్పును సవాలు చేస్తూ టీజీపీఎస్సీతోపాటు, ఇప్పటికే గ్రూప్ 1 నియామక పత్రాలు అందుకున్న పలువురు హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. ఈ అప్పీళ్లపై హైకోర్టు గతంలోనే విచారణ పూర్తి చేసి, తీర్పు రిజర్వ్ చేసింది. గురువారం తీర్పు వెలువరించాల్సి ఉండగా.. అది మళ్లీ ఫిబ్రవరి 5కి వాయిదా పడింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.