
రేషన్ కార్డు దారులకు తెలంగాణలోని రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆహార భద్రత పథకంలో భాగంగా ప్రజలకు అందిస్తున్న బియ్యం సరఫరాలో భాగంగా.. జులై నుంచి నెల నెల అందించనున్నారు. జులై నెలకు సంబంధించి.. ఇప్పటికే కోటా విడుదలైంది.. ఇవ్వాల్టి నుంచి (బుధవారం) రేషన్ కార్డుదారులకు రేషన్ షాపులలో సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. కొన్ని నెలలుగా ప్రతీ మూడు నెలలకు ఒకేసారి బియ్యం కోటా పంపిణీ చేస్తున్నారు.. అయితే.. జులై నుంచి ప్రతీ నెల బియ్యం కోటాను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు పౌరసరఫరాలశాఖ ప్రకటించింది. ఈ మేరకు జులై కోటా సన్నబియ్యం పంపిణీకి పౌరసరఫరాలశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.
రేషన్ కార్డుదారులకు జులైలో రాష్ట్రవ్యాప్తంగా 1.06 కోట్ల కుటుంబాలకు పౌరసరఫరాల శాఖ 2.15 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేయనుంది. మొత్తం 3.41 కోట్ల మంది లబ్ధిదారులకు అందించేందుకు వీలుగా రేషన్ దుకాణాలకు బియ్యాన్ని ఇప్పటికే తరలించారు.. పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా, కచ్చితంగా చేపట్టేందుకు, డిజిటల్ లావాదేవీలను, బయోమెట్రిక్ ధ్రువీకరణ ప్రక్రియల్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని.. ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీలు చేయాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధికారులను మంగళవారం ఆదేశించారు.
అయితే.. అంతకు ముందు యాసంగి ధాన్యం రాక నేపథ్యంలో గోదాముల్లో స్థల లభ్యత సమస్యను తగ్గించేందుకు వీలుగా కేంద్రం ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేయాలని సూచించడంతో దాని ప్రకారం.. మూడు నెలల రేషన్ ను పంపిణీ చేశారు. అయితే.. జులైకి సంబంధించి 2.15 లక్షల టన్నుల బఫర్ స్టాక్ను ముందుగానే రేషన్ షాపులకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ బియ్యం మండలస్థాయి స్టాక్ పాయింట్ల నుంచి గ్రామస్థాయి రేషన్ దుకాణాలకు.. అవసరానికి తగ్గట్లు తరలించినట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..