
తెలంగాణలో కొత్తగా సామాజిక పించన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి రేవంత్ సర్కార్ భారీ శుభవార్త అందించింది. కొత్త పింఛన్ల జారీపై అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన జారీ చేసింది. చాలామంది కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎప్పుడెప్పుడు ప్రభుత్వం నుంచి అందుతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారి నిరీక్షణకు తెరదించింది రేవంత్ ప్రభుత్వం. త్వరలో రెండు లక్షల మందికి చేయూత పింఛన్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి సీతక్క అసెంబ్లీలో ప్రకటించారు. బడ్జెట్లో కూడా వీటికి నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. అసెంబ్లీలో సీతక్క ఏమన్నారో చూద్దాం.
రాబోయే 2026-27 ఆర్ధిక సంవత్సరంలో కొత్తగా 2 లక్షల మందికి చేయూత పథకం ద్వారా నెలనెలా పింఛన్లను అందించనున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా లక్ష మందికి పింఛన్లను మంజూరు చేశామని, వచ్చే ఆర్ధిక సంవత్సరంలో రెండు లక్షల పింఛన్లను కొత్తగా జారీ చేస్తామని తెలిపారు. ఇప్పటికే బడ్జెట్లో వీటిని నిధులను కూడా భారీగా కేటాయించినట్లు వివరించారు. అసెంబ్లీలో మహిళా శిశు సంక్షేమ, గ్రామీణాభివృద్ది, పంచాయతీ రాజ్ శాఖపై చర్చ జరగ్గా.. సీతక్క మాట్లాడారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. పింఛన్లను తొలగిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై కూడా క్లారిటీ ఇచ్చారు. కేవలం అనర్హులు, మరణించినవారి పేర్లను మాత్రమే తొలగిస్తున్నామని, అర్హులకు పింఛన్లు అందుతాయని స్పష్టతనిచ్చారు.
ఇక మహిళల సంక్షేమం కోసం కొత్త పథకాలను ప్రకటించారు. 60 ఏళ్లు పైబడిన మహిళల కోసం ప్రత్యేకంగా పొదుపు సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఇక మహిళల భద్రత కోసం పాఠ్యపుస్తకాల్లో ప్రత్యక పాఠాలను పొందుపరుస్తామన్నారు. మహిళల భద్రత కోసం స్టాండ్ విత్ హర్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఒక్కొ పింఛన్కు కేంద్రం తన వాటా కింద రూ.200 నుంచి రూ.300 వరకు మాత్రమే ఇస్తోంది. ఎన్నో ఏళ్ల నుంచి దీనిని పెంచడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పించన్లను తొలగిస్తుందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తు్న్నాయని, పేదలపై తమకు ఎలాంటి ద్వేషం లేదన్నారు. రెండు పించన్లు పొందుతున్నవారిని పేర్లను తొలగిస్తున్నామన్నారు. అటు కల్యాణలక్ష్మి చెక్కులను ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో జిల్లా ఇంచార్జ్ మంత్రుల చేతుల మీదుగా ఇప్పిస్తున్నారని, దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కోరారు.