ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్.. ఒకేరోజు హస్తినబాట పట్టిన కీలక నేతలు
తెలంగాణ కాంగ్రెస్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకేరోజు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పట్టడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. కేంద్రమంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీల నేపథ్యంలో పాలనాపరమైన అంశాలతో పాటు పార్టీ వ్యవహారాలపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది.

తెలంగాణ కాంగ్రెస్ C/O ఢిల్లీ. హస్తం పార్టీ కీలక నేతలంతా హస్తిన బాట పట్టడంతో.. అసలు ఏం జరుగుతోందన్న చర్చ జోరందుకుంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. పలువురు కేంద్రమంత్రులతోనూ భేటీ అయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేతలతో కూడా రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉండడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఇదే సమయంలో మంత్రి కొండా సురేఖ కూడా ఢిల్లీ చేరుకున్నారు. సురేఖ వెళ్లిన ఫ్లైట్లోనే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి కూడా ఢిల్లీ వెళ్లడం ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ కానున్నారు కొండా సురేఖ. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అపాయింట్మెంట్ కూడా కోరారు సురేఖ. ముఖ్యమంత్రితోపాటు పీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ ఇప్పటికే ఢిల్లీలో ఉండగా మంత్రులు తుమ్మల, సీతక్క కూడా వరుసగా ఢిల్లీ చేరుకుంటున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా బుధవారం ఢిల్లీ చేరుకుంటారు. కొందరు మంత్రులు పాలనాపరమైన అంశాలపై ఢిల్లీ బాటపట్టగా, మరికొందరు పార్టీ పనులపై హస్తిన చేరుకుంటున్నారు.
కీలక నేతల హస్తిన టూర్తో కేబినెట్ విస్తరణపై కూడా టాక్స్ వినిపిస్తున్నాయి. మంత్రిపదవిపై ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లడం, కేసీ వేణుగోపాల్ను కలిసే అవకాశం ఉండటం ఆసక్తి రేపుతోంది. ఇక స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కావడం కూడా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ తాజా రాజకీయ పరిస్థితులపై ఖర్గేతో చర్చించిన గడ్డం ప్రసాద్.. కేబినెట్లో చోటు కల్పించాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది..
