Telangana Rains: తెలంగాణలోని 20 జిల్లాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు.. అక్కడే ఉండాలంటూ ఆదేశాలు

తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయడంతో పాటు జిల్లాల్లోని అధికారులందరూ కార్యస్థావరంలోనే ఉండాలని..

Telangana Rains: తెలంగాణలోని 20 జిల్లాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు.. అక్కడే ఉండాలంటూ ఆదేశాలు
Somesh Kumar

Updated on: Sep 07, 2021 | 2:50 PM

Telangana – Heavy rains and Floods: తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయడంతో పాటు జిల్లాల్లోని అధికారులందరూ కార్యస్థావరంలోనే ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవసరమైతే అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభావిత ప్రాంత జిల్లాల కలెక్టర్లకు తెలిపారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలమేరకు ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ వర్ష ప్రాభావిత 20 జిల్లాల కలెక్టర్లతో కొంచెం సేపటి క్రితం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు.

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వల్ల ఏవిధమైన ఇబ్బందులు లేకుండా తగు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని సోమేష్ కుమార్ కలెక్టర్లకు తెలిపారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల దాదాపుగా అన్ని చెరువులు, కుంటలు, జలాశయాలు పూర్తిగా నిండాయని.. ఈ నేపథ్యంలో అన్ని జలాశయాలపట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

ముఖ్యంగా చెరువుల కట్టల పటిష్టంపై తగు చర్యలు చేపట్టాలని 20 జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. అవసరమైతే, ఎన్.డి.ఆర్.ఎఫ్. సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లను సోమేశ్ కుమార్ ఆదేశించారు. ప్రధాన జలాశయాలు, చెరువులు, కుంటలపరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.

ఈ టెలికాన్ఫరెన్స్ లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, పంచాయితీ రాజ్ కార్యదర్శి సందీప్ సుల్తానియా లతోపాటు 20 జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

Read also: Agency Rains: నాన్ స్టాఫ్ వర్షాలు.. వరద బీభత్సం. నడుముల్లోతు నీటితో మన్యంలో పరిస్థితి ఆగమ్యగోచరం