Telangana: భూ భార‌తి పోర్టల్ ప్రారంభానికి ముహుర్తం ఖరారు.. పైలట్ ప్రాజెక్ట్‌గా 3 మండలాల్లో..

తెలంగాణ ప్రభుత్వం భూ భారతి పోర్టల్‌ను సోమవారం ప్రారంభించనుంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి శనివారంనాడు సమీక్షించారు. రైతులు, ప్రజలకు భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సులభమైన మార్గం అందించడం దీని లక్ష్యం. మూడు మండలాలను పైలెట్ ప్రాజెక్టులుగా ఎంచుకొని, ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. పోర్టల్ సులభమైన భాషలో ఉండాలని, ప్రజల సూచనలతో అప్‌డేట్ చేయాలని సూచించారు.

Telangana: భూ భార‌తి పోర్టల్ ప్రారంభానికి ముహుర్తం ఖరారు.. పైలట్ ప్రాజెక్ట్‌గా 3 మండలాల్లో..

Updated on: Apr 12, 2025 | 11:11 PM

హైద‌రాబాద్‌, ఏప్రిల్ 12, 2025: భూ భారతి పోర్టల్‌ను రైతులు, ప్రజలకు తీసుకొస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన ముహుర్తం ఖరారయ్యింది. ఏప్రిల్ 14న భూ భారతి పోర్టల్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు.  తెలంగాణ రాష్ట్రంలో భూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం, లావాదేవీల‌కు సంబంధించిన స‌మాచారం రైతులకు, ప్రజలకు సుల‌భంగా, వేగంగా అంద‌బాటులో ఉండేలా భూ భార‌తి పోర్ట‌ల్ ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి తెలిపారు. భూ భార‌తిని సోమ‌వారం(14 ఏప్రిల్) ప్రారంభించ‌నున్న నేప‌థ్యంలో త‌న నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి శనివారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సందర్భంగా పలు అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. భూ భారతి ప్రారంభోత్సవం అనంతరం తెలంగాణలోని మూడు మండలాలను పైలెట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసుకొని వాటిలో క‌లెక్ట‌ర్ల ఆధ్వ‌ర్యంలో ప్రజలకు, రైతులకు భూ భార‌తిపై అవ‌గాహ‌న కల్పించాల‌ని సీఎం సూచించారు. ఆయా స‌ద‌స్సుల్లో ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే సందేహాల‌ను నివృత్తి చేయాలన్నారు.

అనంత‌రం రాష్ట్రంలోని ప్ర‌తి మండ‌లంలోనూ క‌లెక్ట‌ర్ల ఆధ్వ‌ర్యంలో స‌ద‌స్సులు నిర్వ‌హించాల‌ని సీఎం ఆదేశించారు. ప్ర‌జలు, రైతుల‌కు అర్ధ‌మ‌య్యేలా, సుల‌భ‌మైన భాష‌లో పోర్ట‌ల్ ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. పోర్ట‌ల్ బ‌లోపేతానికి ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రిస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేయాలని ముఖ్య‌మంత్రి అధికారుల‌కు సూచించారు. వెబ్ సైట్‌తో పాటు యాప్‌ను ప‌టిష్టంగా నిర్వ‌హించాల‌ని సీఎం ఆదేశించారు. స‌మీక్ష‌లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.