
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్ పూలపై నిషేధం అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మార్కెటింగ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ మార్కెట్లలో ప్లాస్టిక్ పూలను విక్రయించకూడదని, ఎవరైనా అమ్మితే చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ రైతు బజార్లు, ప్రభుత్వ మార్కెట్లలో ఈ నిషేధం అమల్లోకి తెచ్చింది. ఒకవేళ ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని, లైసెన్స్ కూడా రద్దు చేస్తామంటూ ప్రకటించింది. సహజ పూలను, వాటి ఉత్పత్తులను మాత్రమే రైతు బజార్లు, మార్కెట్లలో విక్రయించేలా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.
ప్రభుత్వ రైతు బజార్లు, మార్కెట్లలో ప్లాస్టిక్ పూలను ఎక్కువగా అమ్ముతున్నట్లు ఫిర్యాదు వచ్చాయి. సహజ పూలను కాకుండా ప్లాస్టిక్ పూల అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ప్లాస్టిక్ పూల వల్ల సహజ పూల విక్రయాలు జరగడం లేదు. దీని వల్ల తమకు నష్టం జరుగుతోందని పూల వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇటీవల వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా రైతు మేళాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారులు ఆయనను కలిసి తమ బాధను వెల్లబోసుకున్నారు. రైతు బజార్లలో ప్లాస్టిక్ పూల వల్ల తమకు ఆదాయం రావడం లేదని, నష్టం జరుగుతుందని పూల వ్యాపారులు వాపోయారు. దీంతో తుమ్మల నాగేశ్వరరావు స్పందించి ఈ మేరకు చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రైతు బజార్లు, మార్కెట్లలో ఈ ఆదేశాలు వర్తించనున్నాయి.
ఇప్పటికే పలు రాష్ట్రాలు ప్లాస్టిక్ పూలపై నిషేధం అమల్లోకి తెచ్చాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా దానిని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో రైతులు, పూల వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఎప్పటినుంచో ప్లాస్టిక్ నివారణకు చర్యలు చేపడుతోంది. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్పై ఎప్పటినుంచో నిషేధం అమలు చేస్తోంది. ఇక నిషేధం కోస చట్ట సరవణ కోసం కూడా ప్రతిపాదనలు సిద్దం చేసింది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో దీనిని ప్రవేశపెట్టనుందని తెలుస్తోంది.