Telangana: ‘డబ్బు’ల బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో వెలుగులోకి నయా మోసాలు.. పేదల గూడుపై ‘డబుల్’ దందా!!

| Edited By: Srilakshmi C

Jun 20, 2024 | 11:47 AM

మహబూబ్ నగర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో ఒక్కొక్కటిగా అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో పనిచేసిన ఓ అధికారి, తమ కార్యాలయ సిబ్బందితో కలిసి లక్షల్లో అవినీతికి పాల్పడ్డట్లు ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఏకంగా సీఎం కార్యాలయంతో పాటు జిల్లా కలెక్టర్ వద్దకు అవినితీ భాగోతం తీసుకెళ్లడంతో రహస్య విచారణ సాగుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కోక్క ఇళ్లు అక్రమంగా కేటాయింపుకు..

Telangana: డబ్బుల బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో వెలుగులోకి నయా మోసాలు.. పేదల గూడుపై డబుల్ దందా!!
Double Bedroom House Scam
Follow us on

మహబూబ్ నగర్, జూన్‌ 20: మహబూబ్ నగర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో ఒక్కొక్కటిగా అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో పనిచేసిన ఓ అధికారి, తమ కార్యాలయ సిబ్బందితో కలిసి లక్షల్లో అవినీతికి పాల్పడ్డట్లు ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఏకంగా సీఎం కార్యాలయంతో పాటు జిల్లా కలెక్టర్ వద్దకు అవినితీ భాగోతం తీసుకెళ్లడంతో రహస్య విచారణ సాగుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కోక్క ఇళ్లు అక్రమంగా కేటాయింపునకు సుమారు రూ.3 లక్షల నుంచి రూ.6లక్షలు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లు… ‘డబ్బుల్’ బెడ్ రూం ఇళ్లలా మారాయి. ఇళ్ల పంపిణీ అంశంలో నిర్ధిష్టమైన ప్రణాళిక అవలంబించకపోవడంతో అధికారుల అవినితీకి ఆసరాగా మారింది. నియోజకవర్గ పరిధిలో వివిధ ప్రాంతాల్లో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో రేటు ఫిక్స్ చేసి మరీ అమాయక ప్రజలను దోచుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమంగా కేటాయించిన ఒక్కో ఇంటికి లక్షల్లో డబ్బులు వసూలు చేశారని ప్రభుత్వానికి ఫిర్యాదుల వెల్లువెత్తుతున్నాయి.

మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఇందులో దివిటిపల్లి, వీరన్నపేట, మౌలాలిగుట్ట, ఏనుగొండ, క్రిస్టియన్ పల్లి ప్రాంతాల్లో లబ్దిదారులకు ఇళ్ల కేటాయింపులు చేశారు. అయితే పంపిణీ విషయంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు గత కొన్ని రోజులుగా బలంగా వినిపిస్తున్నాయి. పలువురు దరఖాస్తుదారుల వద్ద డబ్బులు తీసుకొని అధికారులు ఇళ్లు కేటాయించారని ఇప్పటికే ఫిర్యాదులు సైతం అందాయి. ఇందులో నాటి మహబూబ్ నగర్ అర్బన్ తహసిల్దార్, ఆర్ఐ, కార్యాలయ సిబ్బంది మధ్యవర్తిని ఏర్పాటు చేసుకొని ప్రధాన పాత్ర పోషించారని బాధితులు చెబుతున్నారు.

ఇంటికి హాట్ బాక్స్ లు, కవర్లలో నగదు…

దావత్‌లకు కాల్చిన మటన్, మందు, బిర్యానీ…

ఇక దివిటిపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్ రూంలకు ధర ఎక్కువగా నిర్ణయించారు. ఇక్కడ ఇళ్లు అక్రమంగా కేటాయించాలంటే సుమారు రూ.5లక్షల వరకు వసూలు చేశారని బాధితులు చెబుతున్నారు. వీరన్నపేటలో రూ.4లక్షలు, మౌలాలిగుట్టలో రూ.3లక్షలు.. ఇలా ఒక్కో ప్రాంతానికి ఒక్కో ధర ఫిక్స్ చేసి కోరిన చోట్ల ఇళ్ల కేటాయింపులు చేశారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలోనే తమకు కూడా అదే పద్ధతిలో కేటాయిస్తామని నమ్మబలికి లక్షల రూపాయలు వసూలు చేశారని చెబుతున్నారు. హాట్ బాక్స్, కవర్లలో నగదును… పార్టీల పేరుతో మందు, కాల్చిన మటన్, బిర్యానీలను తీసుకునే వారని బాధితులు ఆరోపిస్తున్నారు. పట్టా గురించి అడిగితే మాత్రం సమాధానం దాటవేసేవారని వెల్లడించారు. చివరకు ఎన్నికల కోడ్ అడ్డు వచ్చిందని తప్పించుకున్నారని… ఇప్పుడు అడిగితే బదిలీపై వెళ్లిపోయామని సమాధానం ఇస్తున్నారని మొర పెట్టుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

బాధితుల ఆరోపణలకు ఊతం ఇచ్చేలా జిల్లా కేంద్రంలో ఓ మహిళకు ఇళ్ల కేటాయింపు అంశం తెరమీదకు వచ్చింది. సదరు మహిళకు మొదటగా మౌలాలిగుట్టలో A-14-299 ఇంటిని కేటాయించడంతో అది నచ్చలేదని తిరస్కరించారు. దివిటిపల్లిలో మరో నెంబర్ H 22-573 తో ఇళ్లు కేటాయించారు. అయితే అది కూడా నచ్చకపోవడంతో ప్రస్తుతం J 21-553 కేటాయించారు. ఓ పక్క ఇళ్లు రాక బాధితులు అధికారుల కాళ్ల వేళ్ల పడుతుంటే ఆ మహిళకు మాత్రం కోరిన చోట, నచ్చిన ఇళ్లు కేటాయించడం వెనుక అవినీతే ప్రధాన కారణమని తెలుస్తోంది. సదరు అధికారుల చేతివాటంతోనే ఈ తతంగం అంతా నడిచిందని బాధితులు చెబుతున్నారు. ఆ తహసిల్దార్ ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లినప్పటికీ ఇప్పటికూడా ఖాళీ ఇళ్లకు పాత తేదిలతో సంతకాలు చేసి కేటాస్తున్నారని ఆరోపిస్తున్నారు.

జిల్లా కేంద్రానికి చెందిన వంటల వెంకటేశ్, సత్యనారయణ, సరితా అనే మహిళతో పాటుగా పలువురు అధికారులకు డబ్బులు సమర్పించుకుని లబోదిబోమంటున్నారు. పైసా పైసా పోగు చేసి గూడుకోసం ఇస్తే మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేది లేక ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ తో పాటుగా ప్రగతిభవన్ వద్ద జరిగే ప్రజావాణిలో ఈ అంశంపై ఫిర్యాదు చేశారు. బాధితుల వరుస ఫిర్యాదులతో డబుల్ ఇళ్ల స్కాంపై రహస్య విచారణ సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మోసపోయిన తమకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.