
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులకు ప్రాథమిక విద్యను మరింత చేరువ చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం 2026-27 నుంచి మరో 2,700 నుంచి 3,000 పాఠశాలల్లో యూకేజీ తరగతులను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది 1000 స్కూళ్లలో ప్రీ-ప్రైమరీ విద్య ప్రారంభమైన నేపథ్యంలో విస్తరణకు శ్రీకారం చుడుతోంది.
ప్రభుత్వం బడ్జెట్లో భాగంగా 2,000 నుంచి 2,500 పాఠశాలల్లో కొత్తగా పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభిస్తామని ప్రకటించగా, పాఠశాల విద్యాశాఖ మాత్రం దీన్ని మరింత విస్తరించి 3 వేల స్కూళ్ల వరకు తీసుకెళ్లే దిశగా చర్యలు చేపడుతోంది. ఏ పాఠశాలలో ప్రీ-ప్రైమరీ అవసరమో గుర్తించి జాబితా పంపాలని జిల్లా విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6 వేల మందికి తాత్కాలిక ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ప్రతి పాఠశాలలో ఆయా, ఇన్స్ట్రక్టర్లను నియమించి చిన్నారులకు బేసిక్ ఎడ్యుకేషన్ అందించనున్నారు. ఆయాలకు నెలకు రూ.6 వేలు, ఇన్స్ట్రక్టర్లకు రూ.8 వేలు గౌరవ వేతనం ఇవ్వనున్నారు.
రాష్ట్రంలోని 12,700 గ్రామ పంచాయతీలలో కనీసం ఒక్కో పాఠశాలలో ప్రీ-ప్రైమరీ తరగతులను ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం 1,362 పాఠశాలల్లో ఈ తరగతులు కొనసాగుతున్నాయి. సమగ్ర శిక్షా ప్రాజెక్ట్ కింద ఈ కార్యక్రమానికి నిధులు కేటాయించనున్నారు. ఇక ప్రైవేట్ పాఠశాలల తరహాలోనే నర్సరీ, ఎల్కేజీ తరగతులను కూడా ప్రభుత్వ బడుల్లో ప్రవేశపెట్టాలన్న డిమాండ్ పెరుగుతోంది. దీనిపై కూడా ప్రభుత్వం సానుకూలంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో కూడా ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్య అందించేలా ప్రత్యేక ప్రణాళిక అమలు చేయనున్నారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో 28 ప్రాంతాల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుని జీఓ జారీ చేశారు. చిన్నారులకు ప్రాథమిక దశ నుంచే నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం విద్యా రంగంలో కీలక మార్పులకు దారితీసే అవకాశముంది.