Telangana crime: నువ్వు లేని లోకం నాకు వద్దమ్మా.. నేనూ నీ వెంటే వచ్చేస్తున్నా.. మృత్యువులోనూ వీడని బంధం

నవమాసాలు మెసి, కని పెంచిపెద్ద చేసిన అమ్మంటే అతనికి ఎంతో అభిమానం. ఎక్కడికి వెళ్లినా తల్లితో(Mother) కలిసే వెళ్లేవాడు. ఆమెను విడిచి ఒక్క క్షణమైనా ఉండేవాడు కాదు. తల్లితో కలిసి బైక్ పై దేవుని..

Telangana crime: నువ్వు లేని లోకం నాకు వద్దమ్మా.. నేనూ నీ వెంటే వచ్చేస్తున్నా.. మృత్యువులోనూ వీడని బంధం

Updated on: Feb 28, 2022 | 3:10 PM

నవమాసాలు మెసి, కని పెంచిపెద్ద చేసిన అమ్మంటే అతనికి ఎంతో అభిమానం. ఎక్కడికి వెళ్లినా తల్లితో(Mother) కలిసే వెళ్లేవాడు. ఆమెను విడిచి ఒక్క క్షణమైనా ఉండేవాడు కాదు. తల్లితో కలిసి బైక్ పై దేవుని దర్శనానికి బయల్దేరాడు. మొక్కు తీర్చుకుని ఇంటికి వస్తున్నారు. దారిలో గతుకుల రోడ్డు ఉండటంతో ప్రమాదవశాత్తు తల్లి కిందపడిపోయింది. ఈ ఘటనను గమనించకుండా అతను అలాగే ముందుకు వెళ్లిపోయాడు. వెనుక నుంచి వస్తున్న వాహనదారులు విషయం చెప్పడంతో కంగారుగా వెనక్కు వెళ్లాడు. అప్పటికే తీవ్ర గాయాలతో కొన ఊపిరితో ఉన్న తల్లిని చూసి హతాశుడయ్యాడు. గుండెలు బాదుకుంటూ సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే(Mother death) చనిపోయిందని నిర్ధరించారు. తన అజాగ్రత్త వల్లే తల్లి చనిపోయిందని ఆ కుమారుడు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తల్లి లేని ప్రపంచంలో తాను ఉండలేనని మనస్తాపం చెందాడు. సమీపంలో చెరువులో దూకి ఆత్మహత్య(Son suicide) చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గంటల వ్యవధిలోనే తల్లీ, కుమారుడు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని బెన్నూర్‌ గ్రామానికి చెందిన నరేష్‌ తన తల్లి లక్ష్మితో కలిసి బైక్ పై కొడంగల్‌లోని గుడికి వెళ్లాడు. దర్శనం అనంతరం ఇంటికి వస్తుండగా ఉడిమేశ్వరం వద్ద లక్ష్మి ప్రమాదవశాత్తు బైక్ నుంచి కింద పడిపోయింది. తల్లి పడిపోవడాన్ని నరేశ్ గమనించలేదు. అలాగే ముందుకు వెళ్లిపోయాడు. వెనుక నుంచి వస్తున్న వారు విషయం చెప్పడంతో వెనక్కు వెళ్లి చూశాడు. అప్పటికే తీవ్ర గాయాలతో విలవిల్లాడుతున్న లక్ష్మిని వెంటనే కొడంగల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. నరేష్‌ రోదిస్తూ ఈ విషయాన్ని తండ్రికి ఫోన్‌ చేసి చెప్పాడు. బంధువులతో కలిసి ఆయన కొడంగల్‌ చేరుకున్నాడు. కానీ నరేష్‌ కనిపించకపోవడంతో చుట్టుపక్కలా వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. బొంరాస్‌పేట చెరువు వద్ద ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లారు. గట్టుపై వాహనం, దుస్తులు కనిపిండంతో నరేష్‌ చెరువులో దూకి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. శనివారం అర్ధరాత్రి వరకు వెతికినా ఫలితం లేకపోయింది. ఆదివారం ఉదయం నరేష్ మృతదేహం నీటిపై తేలింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గంటల వ్యవధిలో తల్లీ, కొడుకు మృతి చెందడం స్థానికులను కలచివేసింది.

Also Read

IND vs SL: కోహ్లీకే కాదు, శ్రీలంక టీంకు కూడా వెరీ వెరీ స్పెషల్.. మొహాలీ టెస్ట్‌తో చేరనున్న ఆ రికార్డులేంటంటే?

Pregnancy Tips: ప్రెగ్నెన్సీ సమయంలో ఉద్యోగం చేస్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి

Maha Shivaratri 2022: శివరాత్రి ఉపవాసం ఉన్నవారు తినవల్సినవి..

Loading...
Unable to load recommendations.
Follow Us