Telangana: రాష్ట్రంలో సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు అన్నీ బంద్.. ఈ కఠిన నిర్ణయం ఎందుకంటే

|

May 15, 2024 | 6:16 PM

కొత్త సినిమాలు లేవు, ప్రేక్షకులు లేరు, కనీస ఖర్చులు కూడా రావడంలేదు. ఇంకేం చేయాలి? థియేటర్లను మూసేస్తున్నాం అని షాకిచ్చారు తెలంగాణ ఎగ్జిబిటర్లు. పెద్ద హీరోలు ఎక్కువగా సినిమాలు చేయకపోవడం.. నిర్మాతలు సరిగా విడుదల చేయకపోవడం.. ఎలక్షన్లు, ఎండలు, ఓటీటీలో రిలీజ్‌లు, ఐపీఎల్‌ ఇలా రకరకాల కారణాలు.. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల కొంపముంచాయి. ఇక ప్రేక్షకులకు మల్టీప్లెక్సులే దిక్కా? థియేటర్‌కు వెళ్లలేమా?

Telangana: రాష్ట్రంలో సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు అన్నీ బంద్.. ఈ కఠిన నిర్ణయం ఎందుకంటే
Sri Ramulu Theatre
Follow us on

ఇన్నిరోజులు ఓ బాధ ఇప్పుడు ఇంకో బాధ. కరోనా నుంచి కుదుటపడ్డాం అనుకునే లోపే.. థియేటర్లపై ఎలక్షన్‌ పిడుగు పడింది. తెలంగాణ ఎన్నికల దగ్గర్నుంచి.. ఇప్పటివరకు చిన్న థియేటర్‌ చినబోతోంది. సింగిల్‌ స్క్రీన్‌కు వెళ్లేవారు తగ్గిపోతున్నారు. రీ రిలీజ్‌లతో జోష్‌ వచ్చినా.. ఇప్పుడు అవీ బోర్‌ కొట్టేస్తున్నాయి. దీంతో థియేటర్‌కు వచ్చేవారు క్రమంగా తగ్గుముఖం పడుతున్నారు. ఎలక్షన్లతోపాటు.. ఐపీఎల్‌ ఎంటర్టైన్మెంట్‌ కూడా తోడవ్వడంతో తెలుగు నిర్మాతలు తమ సినిమాలను రిలీజ్‌ చేయడానికి జంకుతున్నారు. సమ్మర్‌ అకేషన్‌ను క్యాష్‌ చేసుకుందామనుకున్న వారు కూడా సినిమాలు వాయిదా వేసుకున్నారు. దీంతో థియేటర్‌కు ప్రేక్షకుడు వచ్చే చాన్స్‌ లేకుండా పోయింది. చిన్నా చితకా సినిమాలు వచ్చినా.. ఒకరోజు ఆడడం కూడా గగనమైంది. ఒక్కో థియేటర్‌కు రోజుకు 12వేల రూపాయల నుంచి 18వేల వరకు ఖర్చు అవుతుంది. ఇందులో పదిశాతం కూడా రావడం లేదంటున్నారు థియేటర్‌ యజమానులు. చేసేదేంలేక థియేటర్లను మూసేయడమే తమదగ్గరున్న ఏకైక ఆప్షన్‌ అని చెబుతున్నారు.

చిన్న సినిమాలు వస్తున్నా… థియేటర్‌ ఆక్యుపెన్సీ పడిపోవడంతో ఎగ్జిబిటర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఓవైపు ఎండలు, ఇంకో ఎలక్షన్లు, ఐపీఎల్‌ ప్రభావంతో సినిమాలు విడుదల చేయడంలేదు నిర్మాతలు. పెరిగిపోతున్న ఖర్చులు కూడా కారణం కావొచ్చు. ఇక చిన్నా చితక సినిమాలు, డబ్బింగ్‌ మూవీస్‌ని మల్టీప్లెక్సుల్లోనే చూస్తున్నారు జనం. దీంతో సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌ను మూసేయక తప్పడంలేదు. ఎలక్షన్‌ కోడ్‌ తర్వాత టిల్లు స్క్వేర్‌, ఫ్యామిలీ స్టార్‌ సినిమాలు వచ్చాయి. ఒకటి హిట్టు ఇంకోటి యావరేజ్‌. వీటి తర్వాత మరో పెద్ద సినిమా విడుదల కాలేదు. మేనెల అయినా.. ప్రేక్షకులు చూసేందుకు రెడీగా ఉన్నా.. నిర్మాతలు సినిమాలు విడుదల చేసేందుకు ఆసక్తి చూపలేదు.

మల్టీప్లెక్స్‌ కల్చర్‌ ఎక్కువైపోయింది. వీకెండ్స్‌లో ఫ్యామిలీస్‌ కోసం మంచి ఆప్షన్‌. వీక్‌డేస్‌లో యువత అక్కడివే వెళ్తున్నారు. మల్టీప్లెక్స్‌కు వెళ్తే.. మల్టిపుల్‌ ఆప్షన్స్‌. నాలుగైదు సినిమాలు ఆడుతుంటే తమకు నచ్చినదానికి వెళ్తారు. దీంతో సింగిల్‌ స్క్రీన్‌కు ఆదరణ తగ్గింది. ఇక ఓటీటీల ప్రభంజనం కూడా అంతే స్థాయిలో ఉంది. విడుదలైన మూడు నాలుగు వారాలకే ఓటీటీలోకి వస్తుండడం వల్ల థియేటర్‌కు వెళ్లాలన్న ఆసక్తి కూడా తగ్గిపోయి.. మూతబడే వరకు పరిస్థితి వెళ్లింది.

ఈ శుక్రవారం నుంచి కనీసం పదిరోజుల వరకు మూసేయాలని నిర్ణయించారు. అయితే ఎప్పుడు తెరుస్తారనేది తర్వాత డిసైడ్‌ చేయనున్నారు. ఎన్నికలు, ఎండల ప్రభావమే కాదు.. ఐపీఎల్‌ ఎఫెక్ట్‌ కూడా థియేటర్లపై భారీగానే పడినట్లు తెలుస్తోంది. ఇక థియేటర్ల టికెట్‌ ఖర్చుకూడా పెరగడంతో ప్రేక్షకుల ఆదరణ తగ్గిందంటున్నారు సినీ ప్రముఖులు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.