Telangana: జంపన్న వాగు ఉగ్రరూపం.. ఏడుగురు గల్లంతు.. నలుగురి మృతదేహాలు లభ్యం..

|

Jul 28, 2023 | 1:29 PM

Medaram Jampanna Vagu: ఉగ్రరూపంలో జంపన్న వాగు ఉధృతి కొనసాగుతుంది. కొండాయి, మల్యాల గ్రామాలను వాగు ముంచెత్తింది. వరద ఉధృతితో జంపన్న వాగులో ఏడుగురు గల్లంతయ్యారు. వీరిలో నలుగురి మృతదేహాలు లభించాయి. మరో ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది.

Telangana: జంపన్న వాగు ఉగ్రరూపం.. ఏడుగురు గల్లంతు.. నలుగురి మృతదేహాలు లభ్యం..
Medaram Jampanna Vagu
Follow us on

ములుగు జిల్లా, జులై28: ఉమ్మడి వరంగల్ జిల్లాను వరుణుడు బెంబేలెత్తిస్తున్నాడు. భారీ వర్షాలకు వరంగల్‌ చిగురుటాకుల వణికిపోయింది. ఎటూ చూసిన పొంగిపోర్లుతున్న చెరువులు, కాల్వలతో నగరమంతా సముద్రాన్ని తలపించింది. రోడ్లు, కాలనీలు పూర్తిగా నీటి మునిగి జనం అవస్థలు పడుతున్నారు. ములుగు జిల్లాలో వరద ఉధృతి కొనసాగుతోంది. జంపన్న వాగు జల ప్రళయాన్ని సృష్టిస్తోంది. ఉగ్రరూపంలో జంపన్న వాగు ఉధృతి కొనసాగుతుంది. కొండాయి, మల్యాల గ్రామాలను వాగు ముంచెత్తింది. వరద ఉధృతితో జంపన్న వాగులో ఏడుగురు గల్లంతయ్యారు. వీరిలో నలుగురి మృతదేహాలు లభించాయి. మరో ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది. గల్లంతైన వారి వివరాలు, మరణించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది..

వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. తెలంగాణను అల్లడితల్లడి చేసేస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో యావత్‌ తెలంగాణ ఆగమాగమైంది. వాగు, వంకలు ఏకమై.. ఊర్లను ఏర్లుగా మార్చేశాయి. ప్రధాన జలాశయాలు, వాగులు ప్రమాద హెచ్చరికలు దాటి ప్రవహిస్తున్నాయి.

నిర్మల్‌ జిల్లా భైంసాలో భారీవర్షాలు, వరదల ధాటికి సిరాల చెరువు ఆనకట్ట తెగి.. వరద గ్రామంలోకి చేరింది. భయంతో కట్టుబట్టలతో గ్రామం ఖాళీ చేసిన 200 మంది బాధితులు.. సిరాల గుట్టపై శివాలయంలో తలదాచుకున్నారు. సాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. గ్రామాన్ని వరద చుట్టుముట్టడంతో సహాయకచర్యలకు ఆటంకం కలిగినట్లు చెబుతున్నారు అధికారులు. కట్టకు ఆనుకున్న ఉన్న రామస్వామి ఆలయం వరదల్లో కొట్టుకుపోయినట్లు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు.. వరదలతో బీభత్సం సృష్టిస్తున్నాయ్‌.. గోదావరి మహోగ్రరూపానికి మండలాలకు మండలాలే ఖాళీ చేయించాల్సి వస్తోంది. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం దాల్చుతోంది. గంటగంటకూ నీటిమట్టం పెంచుకుంటూ భయపెడుతోంది. గోదావరి వరద ఉధృతితో రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి 10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండటంతో నీటిమట్టం 55 అడుగులు దాటుతోంది.

నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌ మండలం పిప్రీకి చెందిని నిండుగర్భిణిని వరద ప్రవాహం నుంచి క్షేమంగా కాపాడారు. జేసీబీ ద్వారా గర్భిణిని క్షేమంగా బయటకు తీసుకువచ్చి.. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గర్భిణికి అండగా నిలిచిన అంబులెన్స్‌ సిబ్బందితోపాటు స్థానికులకు బాధితులు కృతజ్ఞతలు చెప్పారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో కురుస్తున్న ఎడతెగని వానకు ప్రధాన రహదారులు చెరువును తలపిస్తున్నాయి. మెయిన్ రోడ్డులోని దుకాణాల్లోకి వరద చేరి వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. స్నేహ నగర్ కాలనీ పూర్తిగా నీటమునిగింది. ఇళ్లల్లోకి వరద చేరి సామగ్రి పూర్తిగా వరదపాలైంది. వర్షం తగ్గకపోవడంతో కాలనీవాసులు భయంతో బతుకీడుస్తున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..