Telangana: మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

|

Oct 16, 2024 | 6:41 PM

రోడ్డు ప్రమాదాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ఇంకా జరుగుతూనే ఉన్నాయి..

Telangana: మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
Follow us on

రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వాహనదారుల నిర్లక్ష్యం, ఓవర్‌టెక్‌, అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం తదితర కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎందరో మరణిస్తున్నారు. తాజాగా తెలంగాణలోని మెదక్ జిల్లా, శివంపేట మండలం రత్నాపూర్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి కల్వర్ట్‌ను ఢీకొట్టి వాగులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

మృతులు రత్నాపూర్ తండా, పాము బండ తండా, తాళ్లపల్లి తండాకు చెందిన వారిగా గుర్తింపు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కారులో మొత్తం 8 మంది ఉండగా, అందులో 7 గురు మృతి చెందగా, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి.

మృతుల వివరాలు :

ప్రమాదంలో మృతి చెందిన వారు శాంతి (38) అమ్ము (12) సీతారాం తండా( 3), అనిత (35), హిందూ (13), శ్రావణి (12), తలపల్లి తండా, శివరాం (56), దుర్గి (45)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం ఆస్పత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్బ్రాంతి

మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరికపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో పాముబండ తండాకు చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గాయపడిన వారికి తక్షణం వైద్యం అందించాలన్నారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని హరీష్‌రావు ప్రభుత్వాన్ని కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి