
కాలం మారుతున్నా.. కట్న పిశాచి మారడం లేదు. తాజాగా అదనపు కట్నం కోసం మరో అబల బలైంది. వరకట్నం వేధింపులు భరించలేక ఏడు నెలల గర్భిణీ బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన మౌనిక అనే యువతికి, భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం బుద్దారం గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడితో వివాహం చేశారున కుటుంబ సభ్యులు. గతేడాది వివాహం సమయంలో కట్న కానుకలు ముట్టజెప్పారు. ప్రస్తుతం మౌనిక ఏడు నెల గర్భిణి. పుట్టబోయే బిడ్డ బాగోగులు చూడాలంటూ అదనపు కట్నం తీసుకురావాలంటూ అత్త, మామ, భర్త వేధింపులకు పాల్పడ్డారు. ఈ టార్చర్ భరించలేక కొంత కాలంగా మౌనిక తల్లిగారి ఇంటి వద్దకు వచ్చి ఉంటోంది.
అయితే తాజాగా మరోసారి అదనపు కట్నం కోసం ప్రశాంత్ వేధింపులకు గురి చేశాడు. దీంతో సోమవారం (నవంబర్ 17) ఇంట్లో ఎవరూ లేని సమయంలో మౌనిక ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మౌనిక మృతికి భర్త ప్రశాంత్, అత్త సులోచన, మామ సంపత్ కారణమని ఆమె తల్లి ఉమ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. తన కూతురు చావుకు కారణమైన ప్రశాంత్ పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది మౌనిక తల్లి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..