
ఇది కలికాలం అని పెద్దలు అంటుంటారు కదా.. కానీ.. కల్తీకాలం అనడం కరెక్ట్ అనుకుంట. ఎక్కడ చూసినా కల్తీ యవ్వారమే నడస్తుంది మరి, ప్రతి దాంట్లో వాడేది కల్తీ సరుకులే.. ఏది కొనాలన్నా భయం.. ఏది తినాలన్నా ఒకటికి 100 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు వచ్చాయి. తాజాగా సికింద్రాబాద్ బేగంపేట్లోని అన్నానగర్లో పలు చికెన్ సెంటర్లపై ఫుడ్ సేఫ్టీ, టాస్క్ఫోర్స్ అధికారులు జాయింట్గా దాడులు నిర్వహించారు. ఈ దాడులలో మతిపోయే నిజాలు బయటపడ్డాయి. చికెన్ సెంటర్ల నిర్వాహకుల ఏకంగా 5 క్వింటాల కుళ్లిన చికెన్ను స్టోర్ చేసి అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. పూర్తిగా కుళ్లిపోయి.. పాడైపోయిన చికెన్ను తక్కువ ధరుకు అమ్ముత లాభాలు సంపాదిస్తున్నారని వెల్లడించారు.
SSS, రవితో పాటు పలు చికెన్ సెంటర్లలో కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉంచిన 5 క్వింటాల చికెన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2, 3 నెలల పాటు నిల్వ ఉంచిన చికెన్ను అతి తక్కువ ధరలకే సమీపంలోని లిక్కర్ షాపులు, బార్లకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ, టాస్క్ఫోర్స్ అధికారులు పాడైపోయిన మాంసాన్ని గుర్తించి.. సీజ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే బర్డ్ ఫ్లూ భయాలున్న నేపథ్యంలో… కుళ్లిన చికెన్ విక్రయించి ప్రజారోగ్యాన్ని పాడు చేస్తోన్న ఇలాంటి దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి