
మయన్మార్లో హింస, అణచివేత కారణంగా వేలాది మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్ మీదుగా భారత్కు చేరుకున్నారు. భద్రత, ఉపాధి, మెరుగైన జీవితం కోసం వచ్చిన వీరిలో చాలామంది వివిధ రాష్ట్రాల్లో స్థిరపడ్డారు. శరణార్థులుగా గుర్తింపు పొందిన రోహింగ్యాల్లో కొందరు జీవనోపాధి కోసం కూలీ పనులు చేస్తుంటే, మరికొందరు నేర ముఠాలుగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇలానే 12 ఏళ్ల క్రితం బర్మాకు చెందిన హమీద్ హుస్సేన్, జహంగీర్ ఆలం, నూర్ కాసిమ్, నూరుల్ అమీన్, నూరుల్ ఆలం అనే రోహింగ్యాలుగా హైదరాబాద్కు వచ్చి.. బాలాపూర్లోని రాయల్ కాలనీలో నివాసం ఉంటున్నారు.
వీరంతా రోజువారీ కూలీ పనులు చేస్తూ జీవనం సాగించే వారు. అయితే వాళ్లకు వచ్చే డబ్బులు జల్సాలకు సరిపోకపోవడంతో వీరంతా ముఠాగా ఏర్పడి ఈజీ మనీపై కన్నేశారు. ఇందుకోసం ట్రాన్స్ఫార్మర్లలో ఉన్న కాపర్ మెటీరియల్, ఆయిల్, అల్యూమినియం వైర్లను దొంగతనం చేయాలని ప్లాన్ చేశారు. ఇక మూసివేసిన కంపెనీలు, గ్రామాలకు దూరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి.. రాత్రి సమయంలో ఆటోల సహాయంతో ట్రాన్స్ఫార్మర్లలోని ఆయిల్, కాపర్ వైర్ ను దొంగిలించడం స్టార్ట్ చేశారు. ఇవి అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడం మొదలు పెట్టారు.
ఇక కష్టపడి పనిచేయడం కన్నా ఇదే ఈజీగా ఉందని భావించిన ఈ ముఠా హైదరాబాద్ సహా నల్గొండ పరిసర ప్రాంతాల్లో కాపర్ వైర్ల చోరీలకు పాల్పడ్డారు. వీటిపై దృష్టి సారించిన జిల్లా పోలీస్ యంత్రాంగం.. నార్కెట్ పల్లిలో వాహనాల తనిఖీ చేస్తుండగా మూడు బైక్లపై వస్తున్న ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. బైక్లకు సంబంధించిన సరైన పత్రాలు చూపించక పోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
విచారణలో పలు ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ వైర్, ఆయిల్, అల్యూమినియం వైర్ దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారనీ నల్లగొండ డిఎస్పి శివరాం రెడ్డి చెబుతున్నారు. ఈ ముఠా 12 నేరాలకు పాల్పడిందని, ఈ ముఠాకు చెందిన ఐదుగురు రోహింగ్యాలను అరెస్టు చేయడంతో పాటు 7.71 లక్షల నగదు, మూడు బైకులు, కట్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.