Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త.. ఏకంగా 10 లక్షల మంది రైతులకు లబ్ది.. త్వరలోనే..

రైతులకు రేవంత్ సర్కార్ ఊరట కలిగించింది. సాదబైనమా భూముల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ భూముల దరఖాస్తులను త్వరలో పరిష్కరించనున్నట్లు శాసనమండలిలో ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది రైతులకు బెనిఫిట్ జరగనుంది. ఈ విషయాన్ని పొంగులేటి తెలిపారు.

Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త.. ఏకంగా 10 లక్షల మంది రైతులకు లబ్ది.. త్వరలోనే..
Telangana Farmers

Updated on: Mar 24, 2026 | 3:07 PM

తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ భారీ శుభవార్త అందించింది. సాదాబైనమా భూముల దరఖాస్తులను త్వరలో పరిష్కరించేందుకు సిద్దమైంది. పెండింగ్‌లో ఉన్న భూముల దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని తాజాగా భావించింది. ఈ మేరకు శాసనమండలిలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. కౌన్సిల్‌లో నెల్లికంటి సత్యం సాదాబైనమా భూములపై ఓ ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నకు పొంగులేటి సమాధానమిస్తూ.. త్వరలో తమ ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో కొనసాగుతున్న సాదాబైనమా భూములను పరిష్కరించి రైతులకు ఊరట కలిగిస్తామని ప్రకటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించిందని, కానీ వాటికి పరిష్కార మార్గం చూపలేదని ఆరోపించారు. 202 ఆర్వోఆర్ చట్టంలో వాటికి పరిష్కారం చూపలేకపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

కొనుగోలుదారుల నుంచి అఫిడవిట్

సాదాబైనమా భూముల పరిష్కారానికి గతంలో ఉన్న నిబంధనలను కాంగ్రెస్ ప్రభుత్వం మార్చింది. గతంలో ఈ భూముల విషయంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కొనుగోలు చేసిన వ్యక్తి, అమ్మిన వ్యక్తి నుంచి అఫిడవిట్ తీసుకునేవారు. కానీ అమ్మిన వ్యక్తి వేరే ప్రాంతానికి వెళ్లడం, వారి నుంచి అఫిడవిట్ తీసుకురావడం కొనుగోలుదారుడికి కష్టంగా మారింది. అమ్మిన వ్యక్తులు అఫిడవిట్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. దరఖాస్తుల పరిష్కారానికి ఈ నిబంధనల అడ్డుగా మారడంతో.. దానిని తొలగించి కొత్త రూల్ తీసుకొచ్చారు. కేవలం కొనుగోలుదారుడి నుంచి అఫిడవిట్ ప్రభుత్వం తీసుకోనుంది. ఇందుకోసం జీవో 76 విడుదల చేయగా.. దీని వల్ల భూమి తమదేనని కొనుగోలుదారుడు అఫిడవిట్ సమర్పిస్తే సరిపోతుంది.

భూధార్ నెంబర్లు కేటాయింపు

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధన వల్ల 9 లక్షలకుపైగా రైతులకు లబ్ది చేకూరనుంది. ఇక భూసమస్యలకు పరిష్కారం చూపేందుకు త్వరలో భూధార్ నెంబర్లను కేటాయించనున్నారు. ఇందుకోసం భూముల రీసర్వే చేయనున్నారు. దీని ద్వారా ప్రతీ సర్వే నెంబర్‌కు ఆధార్ తరహాలోనే ఒక భూధార్ కేటాయిస్తారు. నక్షా మ్యాప్ లేని 5 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా రీ సర్వే చేపట్టి భూధార్ నెంబర్లు జారీ చేశామన్నారు. త్వరలో 32 జిల్లాల్లో భూధార్ నెంబర్ల కేటాయింపు ప్రక్రియ చేపడతామన్నారు. తొలి విడతలో ఒక్కొ జిల్లాలో 70 గ్రామాల చొప్పున రీసర్వే జరుగుతుందని, దశలవారీగా అన్ని సర్వే నెంబర్లకు ప్రత్యేక నెంబర్ల కేటాయింపు జరుగుతుందని, దీని ద్వారా భూవివాదాలు వేగంగా పరిష్కారం అవుతాయన్నారు.  హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లో ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు. భూవివాదాలన్నీ పరిష్కరించి రైతులకు లబ్ది చేకూరేలా చేయనున్నట్లు పొంగులేటి శాసనమండలిలో పేర్కొన్నారు.

Follow Us