Medaram Jatara: 1996లో మేడారం జాతర ఎలా జరిగేదో చూశారా.. చాలా అరుదైన వీడియో
తెలంగాణ కుంభమేళ..మేడారం మహాజాతర విజయవంతంగా పరిసమాప్తమైంది. చల్లని తల్లులు సమ్మక్క-సారాలమ్మ జనం నుంచి మళ్లీ వనంలోకి అంతర్ధానమయ్యారు. ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం చల్లని తల్లుల వనప్రవేశ ఘట్టం సజావుగా ముగిసింది. అశేష భక్తుల జయజయధ్వానాల నడుమ సమ్మక్కను మళ్లీ చిలకలగుట్టకు తరలించారు ఆదివాసీ పూజారులు.

సకల జనులను ఆశీర్వదించిన చల్లని తల్లులు సమ్మక్క సారాలమ్మ వన ప్రవేశ కార్యక్రమంతో మేడారం మహాజాతర అధికారికంగా పూర్తయింది. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క,అధికారులు పాల్గొన్నారు. మూడు రోజులుగా పూజలందుకున్న అడవి తల్లులు మళ్ల వనంలోకి వెళ్లారు. ఒక్కసారి మేడారం ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. జై సమ్మక్క..జై సారాలమ్మ అంటూ నినాదాలు చేశారు భక్తులు. డప్పు చప్పుళ్లు. పూనకాలు.. కోయ నృత్యాలతో మేడారం మార్మోగింది. ఇప్పుడు మేడారం జాతర ఎంత గొప్పగా జరుగుతుందో మనం చూస్తున్నాం.. మరి 30 ఏళ్ల క్రితం.. అంటే 1996లో మేడారం జాతర ఎలా జరిగేది.. అప్పుడు జనం ఎలా వచ్చేశారు.. అసలు మేడారం ఎలా ఉంది వంటి విషయాలను కళ్లకు కట్టేలా.. ఆ రోజుల్లో చిత్రీకరించిన వీడియోను మీ ముందుకు తీసుకొచ్చాం..
తెలంగాణలో ఏటూరునాగారం రహదారిలోని తాడ్వాయి మండల కేంద్రం నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన కీకారణ్య మధ్యన మేడారం గ్రామం, సమ్మక్క సారలమ్మల జాతరకు కేంద్రంగా విలసిల్లుతోంది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి నాడు జరిగే ఈ చారిత్రక గిరిజన పండుగ, 1996లో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు నాలుగు రోజుల పాటు కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించబడింది. వరంగల్ పట్టణానికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి, అడవి తల్లుల మహిమలు ఘనమని విశ్వసించే లక్షలాది మంది భక్తులు పోటెత్తారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని సిరోంచా, ఆహరి, అంకీసా, అసరం ప్రాంతాల నుండి, మధ్యప్రదేశ్లోని బస్తర్ జిల్లా, మద్దెడ్, భూపాల్, జగదల్పూర్ ప్రాంతాల నుంచి, ఒడిశా నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. గిరిజనులే కాకుండా గిరిజనేతరులు కూడా విశేషంగా పాల్గొన్నారు.
చరిత్రను తిరగేస్తే, కాకతీయుల కాలంలో సమ్మక్క సారలమ్మలు గిరిజన బానిసత్వ విముక్తి కోసం పోరాడిన వీర వనితలు. 13వ శతాబ్దంలో ఓరుగల్లును పరిపాలిస్తున్న ప్రతాపరుద్రుని కాలంలో, మేడారం రాజు పగిడిద్ద రాజు కాకతీయులకు కప్పం చెల్లించలేకపోయాడు. దీని ఫలితంగా జరిగిన యుద్ధంలో సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు వీరమరణం పొందగా, జంపన్న సంపెంగ వాగులోకి దూకి ప్రాణత్యాగం చేశాడు. చివరికి సమ్మక్క కూడా యుద్ధంలో గాయపడి నెమలినార చెట్టు దగ్గర పడిపోయి, చిలకలగుట్టపైకి వెళ్లి అదృశ్యమైపోయింది. అక్కడ పసుపు కుంకుమలతో ఒక భరిణ కనిపించిందని ప్రతీతి. మాఘశుద్ధ పౌర్ణమి నాడు సమ్మక్క సారలమ్మల జాతర జరగడానికి ఈ చారిత్రక నేపథ్యమే కారణం.
