
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓరుగల్లులో పర్యటించారు. రోజురోజుకూ ఆయుష్షు క్షీణిస్తున్న ఒక అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న తన వీరాభిమాని చివరి కోరికను తీర్చేందుకు ఆయన స్వయంగా వచ్చారు. ఆ బాలుడి ఇంట్లోనే దాదాపు 40 నిమిషాల పాటు సరదాగా గడిపారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ను చూసి ఆనందంతో మురిసిపోయిన ఆ బాలుడు ఒక వినూత్నమైన కోరిక కోరాడు. హనుమకొండలోని హనుమాన్ నగర్ ప్రాంతానికి చెందిన రాము – మానస దంపతుల కుమారుడు నిరంజన్ ప్రస్తుతం ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్నాడు. వయస్సు 17 ఏళ్లే అయినా.. ఈ వ్యాధి కారణంగా రోజురోజుకూ ఆయుష్షు తరిగిపోతోంది. అయితే నిరంజన్కు పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం. తన జీవితంలో ఒక్కసారైనా తన అభిమాన నాయకుడిని, నటుడిని చూడాలన్నదే ఆ ఛోటా గబ్బర్ సింగ్ ఏకైక కోరిక.
ఈ బాలుడి పరిస్థితి జనసేన సైనికులు, కొందరు సామాజిక కార్యకర్తల ద్వారా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లింది. విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ చలించిపోయి బాలుడి ఇంటికి వచ్చారు. బాలుడిని పలకరించి, పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ప్రస్తుతం బాలుడికి అందుతున్న ట్రీట్మెంట్ వివరాలను తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు.
దాదాపు 40 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ ఆ బాలుడితోనే గడిపారు. ఈ సుదీర్ఘ సంభాషణలో నిరంజన్ చాలా విషయాలు నేరుగా పవన్ కళ్యాణ్తో మాట్లాడాడు. అయితే ఈ 40 నిమిషాల ముచ్చట్లలో దాదాపు రెండున్నర నిమిషాల పాటు కేవలం ఒక కుక్క పిల్ల గురించే చర్చ జరిగింది. తనకు ఒక అందమైన కుక్కపిల్ల కావాలని, దానిని పెంచుకోవాలని ఉందని నిరంజన్ తన మనసులోని మాటను పవన్తో పంచుకున్నాడు.
ఎలాంటి పెంపుడు కుక్క కావాలని పవన్ కళ్యాణ్ అడిగిన వెంటనే.. నిరంజన్ తన ఫోన్లో ఒక ఫొటో చూపిస్తూ.. తనకు పూడిల్ బ్రీడ్కు చెందిన కుక్కపిల్ల కావాలని కోరాడు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా అచ్చం బొమ్మలా ఉండే ఈ పూడిల్ బ్రీడ్ పెట్ డాగ్నే పెంచుకుంటున్నారు. చరణ్ దగ్గర ఉన్న కుక్కపిల్లను చూసే నిరంజన్ కూడా అలాంటిదే కావాలని కోరుకున్నాడు. అభిమాని కోరిక విన్న వెంటనే పవన్ కళ్యాణ్ ఎంతో ఉదారంగా స్పందించారు. నిరంజన్ కోరిన విధంగానే పూడిల్ బ్రీడ్ పెట్ డాగ్ను అతనికి పంపిస్తానని హామీ ఇచ్చారు. తన వ్యక్తిగత సిబ్బందిని పిలిచి.. బాలుడి కోరిక మేరకు వెంటనే వెతికి మరీ ఆ అరుదైన బ్రీడ్ కుక్కపిల్లను తెచ్చి ఇవ్వాలని ఆదేశించారు. పవన్ కళ్యాణ్ చూపిన ఈ మానవత్వానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.