
సాధారణంగా ఏదైనా ఆలయానికి వెళ్తే.. అక్కడ ఉన్న హుండీలో డబ్బులు, బంగారం, వెండి ఇలా వేస్తూ ఉంటాం. ఇలా అవి ఏదో రకంగా గుడికి, దేవుడికి ఉపయోగపడతాయి. కానీ కొంతమంది మాత్రం వారు హుండీలో వేసేవి దేనికి పనికిరాకుండా వేస్తున్నారు. పాత 500 నోట్లు, 1000 నోట్లు ఇంకా కనిపిస్తున్నాయి. అవి ఎక్కడో కాదు ఆలయాల హుండీలో.. ఆలయ హుండీలో రద్దయిన పాత నోట్లు ఇంకా దర్శనమిస్తూనే ఉన్నాయి.
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేతకి సంగమేశ్వర ఆలయంలో చేపట్టిన హుండీ లెక్కింపులో మరోమారు రద్దయిన ఐదు వందలు, వెయ్యి రూపాయల పాత నోట్లు కనిపించాయి. ఆలయ ప్రాంగణంలో హుండీ లెక్కిస్తుండగా 11,500 విలువైన ఐదు వందలు, మూడు వెయ్యి నోట్లను భక్తులు కానుకల రూపంలో హుండీలో వేశారు. పాత నోట్లను మార్చుకునేందుకు ప్రభుత్వం గడువు ఇచ్చిన మార్చుకొని వ్యక్తులు ఇంకా ఆలయాల్లో హుండీలో వేసి ‘నీవే మార్చుకో అన్నట్లు’ దేవుడిపై భారం వేస్తున్నారు. కానుకల రూపంలో వచ్చిన పాత నోట్లను ఎలా మార్చుకోవాలో తెలియక దేవాదాయ శాఖ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.