ఐపీఎల్ క్రేజ్‌ను క్యాష్ చేసుకున్న కిలాడీలు.. అసలు వీరు వాడిన టెక్నిక్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఐపీఎల్ అంటే కేవలం పరుగుల వరద, వికెట్ల వేట మాత్రమే కాదు.. అదో భారీ వ్యాపార సామ్రాజ్యం. ఈ క్రేజ్‌ను పెట్టుబడిగా మార్చుకుని కొందరు అక్రమార్కులు సామాన్య అభిమానులను మోసం చేయడం చూస్తూనే ఉంటాం. కానీ, ఏకంగా దేశ అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తుల పేర్లనే వాడుకుని, క్రికెట్ బోర్డులనే బురిడీ కొట్టించిన ఒక భారీ స్కామ్ ఇప్పుడు హైదరాబాద్‌లో కలకలం రేపింది.

ఐపీఎల్ క్రేజ్‌ను క్యాష్ చేసుకున్న కిలాడీలు.. అసలు వీరు వాడిన టెక్నిక్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Ipl Tickets Scam

Edited By:

Updated on: May 09, 2026 | 9:05 PM

ఐపీఎల్ అంటే కేవలం పరుగుల వరద, వికెట్ల వేట మాత్రమే కాదు.. అదో భారీ వ్యాపార సామ్రాజ్యం. ఈ క్రేజ్‌ను పెట్టుబడిగా మార్చుకుని కొందరు అక్రమార్కులు సామాన్య అభిమానులను మోసం చేయడం చూస్తూనే ఉంటాం. కానీ, ఏకంగా దేశ అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తుల పేర్లనే వాడుకుని, క్రికెట్ బోర్డులనే బురిడీ కొట్టించిన ఒక భారీ స్కామ్ ఇప్పుడు హైదరాబాద్‌లో కలకలం రేపింది. కేవలం గూగుల్‌లో దొరికే సమాచారంతో వీవీఐపీ కోటా టికెట్లను దక్కించుకున్న ముగ్గురు యువకుల ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా, పార్కింగ్ ప్రాంతంలో తిరుగుతున్న ఒక మహీంద్రా థార్ వాహనంపై అనుమానం కలిగింది. అందులోని యువకుల ప్రవర్తన వింతగా ఉండటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారు చెప్పే పొంతన లేని సమాధానాలతో లోతుగా ఆరా తీయగా, ఒక అంతర్రాష్ట్ర టికెట్ మోసం బట్టబయలైంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన ఘట్టమనేని అశోక్, కంకాల దినేశ్, సింగమేనని వేణుమాధవ్ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. సులభంగా డబ్బు సంపాదించేందుకు వారు ఎంచుకున్న మార్గం విస్మయానికి గురిచేస్తోంది: గూగుల్‌లో వెతికి హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, గవర్నర్ల అధికారిక లెటర్ హెడ్లను డౌన్‌లోడ్ చేశారు. ఆయా ప్రముఖుల సంతకాలను అచ్చుగుద్దినట్లుగా ఫోర్జరీ చేసి, వీవీఐపీ కోటాలో టికెట్లు కావాలని నకిలీ లేఖలు సృష్టించారు. ఈ ఫేక్ లెటర్లను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA), తమిళనాడు, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్లకు పంపించి, అత్యంత ఖరీదైన ‘కాంప్లిమెంటరీ’ టికెట్లను ఉచితంగా పొందారు. అలా పొందిన ఉచిత టికెట్లను బయట సామాన్య అభిమానులకు వేల రూపాయలకు విక్రయించి లక్షలు ఆర్జించారు.

నిందితులు ఇప్పటికే ఉప్పల్‌లో రెండు మ్యాచ్‌లకు, బెంగళూరులో రెండు మ్యాచ్‌లకు ఇదే పద్ధతిలో టికెట్లు పొందారు. అయితే, వరుసగా అదే తరహా సిఫార్సు లేఖలు రావడంతో హెచ్‌సీఏ అధికారులకు అనుమానం కలిగింది. లేఖలోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించగా అవి నకిలీవని తేలింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి రూ.1.10 లక్షల విలువైన ఐదు ఐపీఎల్ టికెట్లు, మహీంద్రా థార్ వాహనం, ఐదు మొబైల్ ఫోన్లు, ఐదు ఫోర్జరీ లెటర్ హెడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ ముఠాకు సహకరించిన చెన్నైకి చెందిన ఆశిష్, సెంథిల్, తాన్సిల్ అనే మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

కేవలం ఇంటర్నెట్ సమాచారంతో వ్యవస్థలోని లొసుగులను వాడుకుని ఇంత పెద్ద మోసానికి పాల్పడటం అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. వీవీఐపీ కోటా పంపిణీలో ఉన్న లోపాలపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us