Newborn girl: కన్నది కాదు కసాయిది.. బస్టాండ్ పబ్లిక్ టాయిలెట్‌లో నవజాత శిశువు.. ఆ దృశ్యం చూస్తే

తల్లి ప్రేమకు మచ్చ తెచ్చేలా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పుట్టిన కొన్ని నిమిషాలకే ఆ పసిపాపను కన్నతల్లే చెత్తకుప్పలా బస్టాండ్ మరుగుదొడ్డిలో వదిలివెళ్లిపోయింది. మానవత్వం మంటగలిసిన ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. బస్టాండ్ టాయిలెట్‌లో పసిపాప ఏడుపు వినిపించడంతో గమనించిన ఓ మహిళ పోలీసులకు సమాచారం అందించింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

Newborn girl: కన్నది కాదు కసాయిది.. బస్టాండ్ పబ్లిక్ టాయిలెట్‌లో నవజాత శిశువు.. ఆ దృశ్యం చూస్తే
Newborn Abandoned

Edited By:

Updated on: May 01, 2026 | 4:55 PM

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌లో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగుచూసింది. కని పెంచాల్సిన కన్నతల్లే నవజాత శిశువును మరుగుదొడ్డిలో వదిలివెళ్లిన ఉదంతం స్థానికులను కలచివేసింది. జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌లో ప్రయాణికులతో రద్దీగా ఉన్న సమయంలో ఈ ఘటన వెలుగు చూసింది. బస్టాండ్ ఆవరణలోని టాయిలెట్ నుంచి పసిపాప ఏడుపు వినిపించడంతో అటుగా వెళ్తున్న ఓ మహిళ అనుమానంతో లోపలికి వెళ్లి చూసింది. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆమె నిశ్చేష్టురాలైంది. బొడ్డు కోయని నవజాత శిశువు రక్తపు మడుగులో, ఒంటరిగా పడి ఉంది. ఏడుస్తున్న ఆ పసిప్రాణాన్ని చూసి చలించిపోయిన సదరు మహిళ వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.

సమాచారం అందుకున్న పోలీసులు, చైల్డ్ కేర్ అధికారులు నిమిషాల వ్యవధిలోనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శిశువును సురక్షితంగా బయటకు తీసి, ప్రథమ చికిత్స అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువుకు వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అదృష్టవశాత్తూ పాప ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని వైద్యులు ధ్రువీకరించారు.

సమాజంలో పెరుగుతున్న నైతిక విలువల పతనాన్ని ఈ ఘటన ప్రతిబింబిస్తోంది. ఎటువంటి పరిస్థితుల్లో ఆ తల్లి ఇంత కఠిన నిర్ణయం తీసుకుంది? ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బస్టాండ్ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానిత మహిళల కదలికలపై నిఘా ఉంచారు.

ఇవి కూడా చదవండి

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే సంక్షోభంలో ఉన్న గర్భిణీలకు లేదా మహిళలకు అండగా నిలిచే వ్యవస్థలను బలోపేతం చేయాలని సామాజికవేత్తలు కోరుతున్నారు. శిశువు ప్రాణాలను కాపాడిన మహిళను, తక్షణమే చర్యలు చేపట్టిన పోలీసు యంత్రాంగాన్ని జిల్లా ప్రజలు ప్రశంసిస్తున్నారు. అనాథగా మారిన ఆ పసిపాప బాధ్యతను ప్రస్తుతం శిశు సంక్షేమ శాఖ చూసుకుంటోంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us