Telangana: ట్రాఫిక్‌ చలాన్లు ఎగ్గొడుతున్నారా.. 5 కంటే ఎక్కువ ఉంటే మీకో షాకింగ్‌ న్యూస్‌.!

హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి, చలాన్లు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్న వాహనదారులపై ప్రభుత్వం కొరడా ఝులిపించనుంది. ఇకపై పెండింగ్ చలాన్లు ఉంటే కేవలం జరిమానాతో సరిపెట్టకుండా, నేరుగా డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు వాహనం ఆర్సీ ని కూడా ఫ్రీజ్ చేసేలా రవాణాశాఖ కఠిన నిర్ణయం తీసుకుంది.

Telangana: ట్రాఫిక్‌ చలాన్లు ఎగ్గొడుతున్నారా.. 5 కంటే ఎక్కువ ఉంటే మీకో షాకింగ్‌ న్యూస్‌.!
Traffic Police

Updated on: Mar 24, 2026 | 5:22 PM

మీ వెహికిల్‌పై ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయా…? తర్వాత కట్టుకోవచ్చులే అని లైట్ తీసుకుంటున్నారా…? లేదంటే ప్రభుత్వం ఆఫర్లు ప్రకటించినప్పుడు చూద్దాంలే అనుకుంటున్నారా…? అయితే మీరు చిక్కుల్లో పడ్డట్టే…! ఇక నుంచి చలాన్లు కట్టకుండా తప్పించుకోవడం కుదరనే కుదరదు. సకాలంలో ఫైన్ చెల్లించకపోతే RCతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు కావొచ్చు…! ఏప్రిల్ ఫస్ట్ నుంచి అమల్లోకి రాబోతున్న కొత్త ట్రాఫిక్ వాయ్‌లేషన్ రూల్స్‌ కాస్త కఠినంగానే ఉండబోతున్నాయి.

ఇకపై ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాల్సిందే…! వెహికిల్‌పై చలాన్ల విషయంలో నిర్లక్ష్యాన్ని వదలిపెట్టాల్సిందే…! లేదంటే తీవ్రంగా నష్టపోవడం పక్కా. ఏప్రిల్ ఫస్ట్ నుంచి కొత్త ట్రాఫిక్ వాయ్‌లేషన్ రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. తెలంగాణలోనూ ఆ రూల్స్‌ను కఠినంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది. కేంద్ర మోటార్‌ వెహికల్ నిబంధనల ప్రకారం జరిమానాలపై అభ్యంతరాలను పరిష్కరించేందుకు గ్రీవెన్స్‌ రెడ్రెసల్‌ అథారిటీని కూడా నియమించనుంది. దీనికోసం ప్రాథమిక నోటిఫికేషన్‌ ఒకట్రెండు రోజుల్లో జారీ కానున్నట్లు తెలుస్తోంది. నయా రూల్స్ ప్రకారం ఏడాదికి 5 కంటే ఎక్కువ చలాన్లు ఉండి, వాటిని చెల్లించకపోతే మీ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంది.

ఒకవేళ నిజంగానే లైసెన్స్ ఫ్రీజ్ అయితే మీ వెహికిల్ రోడ్డ మీద తిరగడానికి వీల్లేదు. ఏం అవుతుందిలే అని రోడ్డెక్కారో… వెహికిల్ సీజ్‌ కావడం పక్కా. ఒకవేళ చలాన్లు ఉన్నాయని ఇంట్లోని వెహికిల్ పెట్టుకుని కూర్చున్నా వదిలేదే లేదన్నట్లుగా ఉంది నయా రూల్. 45 రోజుల డెడ్‌లైన్‌ విధించి.. అప్పటికీ ఫైన్ పే చేయకపోయినా వెహికిల్ సీజ్‌ అయినట్లే. కొన్నిసార్లు టెక్నికల్ సమస్యల వల్ల వాహనానికి పొరపాటున చలాన్లు పడుతుంటాయి. అలాంటి సందర్భాల్లో వాహనదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చలాన్లపై అభ్యంతరాలను వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ‘గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీ’ని ఏర్పాటు చేయనుంది. అక్కడ ఒక నిర్దిష్ట సమయంలోపు మీ సమస్యను పరిష్కరించి, అది పొరపాటు అయితే చలాన్‌ను రద్దు చేస్తారు.

చలాన్లే కదా అని చిన్నచూపు చూడొద్దు…ట్రాఫిక్ రూల్స్ పాటించండి సేఫ్‌గా గమ్యస్థానాలకు వెళ్లండి అంటూ ఇప్పటికే సీఎం రేవంత్ పలుమార్లు హెచ్చరించారు. పలువురి నిర్లక్ష్యం వల్ల అమాయక ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ… చలాన్లు చెల్లించేందుకు ఇచ్చే డిస్కౌంట్ ఆఫర్లకు కూడా నో చెప్పేశారు. ఇప్పుడా మాటలకు కొనసాగింపుగా మరింత బలం చేకూరుస్తోంది కేంద్రం గెజిట్. ఇక నయా రూల్స్‌కి తగ్గట్టుగా వాహనదారులు మారాల్సిందే. వాహనంపై ఏవైనా చలాన్లు ఉన్నాయో లేదో నెలకు ఒకసారి ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవాల్సిందే. ప్రభుత్వం అప్పుడప్పుడు ఇచ్చే చలాన్ డిస్కౌంట్ ఆఫర్ల కోసం వేచి చూడకుండా, వెంటనే చెల్లించడం అలవాటు చేసుకోవాల్సిందే. అసలు చలాన్లే పడకుండా హెల్మెట్ ధరించడం, సిగ్నల్ జంప్ చేయకపోవడం వంటి ట్రాఫిక్ రూల్స్‌ను అందరికీ మంచిది. లేదంటే మీ వెహికిల్ రోడ్డుపై తిరిగడం కష్టమే.!

 

ఇది చదవండి:  1983 తర్వాత ఇదే అతిపెద్ద క్రాష్.! బంగారం, వెండి ధరల్లో బబుల్ బరస్ట్.. కొంపలు అంటుకుంటున్నాయ్

Follow Us