బాల సాహిత్యానికి అరుదైన గౌరవం.. మహారాష్ట్ర పాఠ్యపుస్తకంలో నల్లగొండ ఉపాధ్యాయుడి బాలగేయం..

నల్లగొండ జిల్లా కనగల్ మండలానికి చెందిన బాల సాహితీవేత్త, ఉపాధ్యాయుడు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి రచించిన "కంప్యూటర్ పిల్లలం" బాలగేయానికి అరుదైన గౌరవం లభించింది. మహారాష్ట్ర ప్రభుత్వం నాలుగో తరగతి తెలుగు "బాలభారతి" పాఠ్యపుస్తకంలో ఈ గేయాన్ని పాఠ్యాంశంగా చేర్చింది. పిల్లలకు సులభంగా అర్థమయ్యే పదాలు, లయబద్ధమైన శైలి, ఆధునిక సాంకేతికతపై అవగాహన కల్పించే అంశాలతో రూపొందిన ఈ గేయం వేలాది మంది విద్యార్థులకు చేరనుంది.

బాల సాహిత్యానికి అరుదైన గౌరవం.. మహారాష్ట్ర పాఠ్యపుస్తకంలో నల్లగొండ ఉపాధ్యాయుడి బాలగేయం..
Telangana Teacher Childrens Song

Edited By:

Updated on: Jul 17, 2026 | 11:08 AM

తెలుగు నేల మీద పుట్టిన అక్షరం.. తెలుగు రాష్ట్రాల సరిహద్దులు దాటుతున్న తెలుగు బాల సాహిత్యానికి చక్కటి ఆదరణ లభిస్తోంది. బాల సాహితీ వేత్త.. కలం నుంచి జాలువారిన గేయానికి పొరుగు రాష్ట్ర పాఠ్య పుస్తకంలో చోటు దక్కింది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు పాఠ్యాంశంగా చదవబోతున్నారు. దీంతో తెలంగాణ ఉపాధ్యాయుడి సృజనాత్మకతకు అరుదైన గుర్తింపు లభించడం పట్ల పలువురు విద్యావేత్తలు, సాహితీవేత్తలు ఆయన్ను అభినందిస్తున్నారు.

బాల సాహితీవేత్త కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి..

న‌ల్లగొండ జిల్లా కనగల్ మండలం చిన్నమాదారం ఉన్నత పాఠశాలలో ప్రముఖ బాల సాహితీవేత్త కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 20 ఏళ్లకు పైగా బాల సాహిత్య రంగంలో సేవలంది స్తున్నారు. పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందిస్తూ నిరంతరం కథలు, గేయాలు, పాటలు, కవితలు రాస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. పిల్లల మనస్తత్వానికి అనుగుణంగా సులభమైన భాషలో రచనలు చేయడం ఆయన ప్రత్యేకత. గత ఏడాది కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి రాసిన ‘ఊగుతున్న ఉయ్యాల’ బాలల గేయ సంపుటిని పాఠకులను విశేషంగా ఆకట్టుకుంది.

కంప్యూటర్ పిల్లలం బాలగేయం..

మరాఠీ ఆదిపత్యం కలిగిన మహారాష్ట్రలో పాఠ్యపుస్తకాల తయారీ ప్రక్రియ చాలా కఠినంగా ఉంటుంది. విషయం, భాషా సరళత, బాలల మనస్తత్వం వంటి అనేక కోణాలను పరిశీలించిన తర్వాతే పాఠ్యాంశాలను ఎంపిక చేస్తారు. రెండేళ్ల క్రితం మహారాష్ట్ర పాఠ్యాంశాల ఎంపిక కమిటీ.. కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి రాసిన బాల సాహిత్యం, పుస్తకాలను పరిశీలించింది. ముఖ్యంగా బుచ్చిరెడ్డి రాసిన ‘ఊగుతున్న ఉయ్యాల’ బాల గేయ సంపుటిని పరిశీలించింది. మహారాష్ట్ర ప్రభుత్వం, తెలుగు భాషను అభ్యసిస్తున్న అక్కడి నాలుగో తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన ‘బాలభారతి’ పాఠ్య పుస్తకంలోనీ కంప్యూటర్ పిల్లలం’ గేయాన్ని ఒక పాఠ్యాంశంగా చేర్చింది.

Telangana Teacher Song

సాహితీ సరిహద్దుల చెరిపివేత..

సాంకేతిక యుగంలో పెరుగుతున్న చిన్నారులకు సులభమైన పదాలతో, లయబద్ధంగా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పరిచయం చేసే “కంప్యూటర్ పిల్లలం”గేయం.. పిల్లల్ని అలరిస్తూనే ఆలోచింపజేస్తుంది. క్లిష్టమైన భాషా పరిజ్ఞానం లేకుండా, పిల్లలు సులభంగా పాడుకోగలిగే లయబద్ధమైన శైలి ఇందులో ఉంది. ఆధునిక సాంకేతికతను (కంప్యూటర్) పాఠ్యాంశంలోకి తీసుకురావడం ద్వారా, విద్యార్థులలో సైన్స్ పట్ల ఆసక్తిని పెంచేలా ఉండటం. నేటి డిజిటల్ యుగంలో పిల్లల ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించేలా ఉండటంతో ఈ గేయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన నాలుగో తరగతి తెలుగు ‘బాల భారతి’ పాఠ్య పుస్తకంలో పాఠ్యాంశంగా చేర్చింది. బుచ్చిరెడ్డి రచించిన “ఊగుతున్న ఉయ్యాల” బాల గేయాల సంపుటి ఇప్పటికే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థుల ప్రశంసలు అందుకుంది. సరళమైన భాష, పిల్లలకు అర్థమయ్యే పదాలు, విలువలతో కూడిన భావాలు ఈ పుస్తకానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. తెలుగు బాలసాహిత్యానికి మరో కొత్త మైలురాయిగా నిలిచిపోయింది.

తరగతి గదిలో పిల్లలకు అక్షరాలు నేర్పే గురువు… ఇప్పుడు మరో రాష్ట్రంలోని పిల్లల మనసుల్లో తన పదాలను నాటబోతున్నారు. తెలుగు భాషకు, బాలసాహిత్యానికి, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల సృజనాత్మకతకు దక్కిన గౌరవమని బాల సాహితీవేత్త కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి చెబుతున్నారు. నల్లగొండ జిల్లా నుంచి వెలిసిన ఓ గేయం… ఇప్పుడు మహారాష్ట్రలోని వేలాది మంది చిన్నారుల గొంతుల్లో మార్మోగబోతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us