Telangana: కొడుకు చితికి నిప్పంటించిన తల్లి.. వీర జవాన్ అంత్యక్రియల్లో హృదయవిదారక దృశ్యం

జార్ఖండ్‌లో విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుతో మృతి చెందిన రంగారెడ్డి జిల్లా రావిర్యాలకు చెందిన 58 ఏళ్ల సీఆర్పీఎఫ్ జవాన్ గంగపుత్ర శంకర్‌కు స్వగ్రామంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. జవాన్‌కు ఇద్దరు కుమార్తెలే ఉండటంతో ఆయన వృద్ధ తల్లే కుమారుడి చితికి నిప్పంటించి చివరి వీడ్కోలు పలికింది.

Telangana: కొడుకు చితికి నిప్పంటించిన తల్లి.. వీర జవాన్ అంత్యక్రియల్లో హృదయవిదారక దృశ్యం
Jawan Gangaputra Shankar Last Rites

Updated on: Jun 26, 2026 | 8:48 AM

దేశ సేవలో ఉండగానే వీర జవాన్ గంగపుత్ర శంకర్ గుండెపోటుతో కన్నుమూయగా.. ఆయన అంత్యక్రియల్లో ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించిన ఘటన చోటుచేసుకుంది. జార్ఖండ్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో గుండెపోటుతో మృతి చెందిన 58 ఏళ్ల సీఆర్పీఎఫ్ జవాన్‌కు స్వగ్రామంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే సదరు జవాన్‌కు ఇద్దరూ కూతుళ్లే ఉండటంతో..  అంత్యక్రియల సమయంలో ఆయన వృద్ధ తల్లే తన కుమారుడి చితికి నిప్పంటించి చివరి వీడ్కోలు పలికింది.

Jawan Shankar

రంగారెడ్డి జిల్లా రావిర్యాలకు చెందిన ఈ జవాన్ జార్ఖండ్‌లో విధులు నిర్వర్తిస్తుండగా ఆకస్మికంగా గుండెపోటుకు గురై మృతి చెందారు. సమాచారం అందుకున్న సీఆర్పీఎఫ్ అధికారులు ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. గ్రామంలో అధికార లాంఛనాలతో గౌరవ వందనం నిర్వహించి, సైనిక మర్యాదల మధ్య అంతిమయాత్ర చేపట్టారు.

జవాన్‌కు భార్య అరుణ, కుమార్తెలు అనూష, నిఖిత ఉన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు తుది వీడ్కోలు పలికారు. అనంతరం కన్నకొడుకు చితికి తల్లే నిప్పంటించిన దృశ్యం అక్కడున్న వారిని తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది. ఆ తల్లి రోదనలు చూసి బంధువులు, గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు.

దేశ రక్షణ కోసం 40 ఏళ్ల పాటు సేవలందించిన వీర జవాన్‌కు అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు ఘనంగా నివాళులర్పించారు. సైనిక గౌరవాలతో సాగిన ఆయన అంత్యక్రియలు గ్రామంలో విషాదాన్ని నింపగా, తల్లి తన కుమారుడికి చివరి వీడ్కోలు పలికిన హృదయవిదారక దృశ్యం అందరినీ కలచివేసింది.

వీడియో దిగువన చూడండి…

Follow Us