
హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై శనివారం (మే 30) పెను ప్రమాదం తృటిలో తప్పింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామం సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ స్లీపర్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. హైదరాబాద్ నుంచి కాకినాడకు 36 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ బస్సు ఇంజిన్ భాగంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ప్రారంభమైనట్లు సమాచారం. బస్సు నుంచి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై వాహనాన్ని రోడ్డుపక్కన నిలిపివేశాడు.
అనంతరం డ్రైవర్, సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ క్షేమంగా బయటకు దించారు. కొద్ది నిమిషాల్లోనే మంటలు వేగంగా వ్యాపించి బస్సు మొత్తం అగ్నికి ఆహుతైంది. దీంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ ఘటన కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. అయితే బస్సులో ఉన్న 36 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెను విషాదం తప్పింది. ఘటనకు గల ఖచ్చితమైన కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. డ్రైవర్ అప్రమత్తత, సిబ్బంది సమయస్ఫూర్తి వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.