
తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “తెలంగాణ ఎవరి అయ్యా జాగీరు కాదు, ఇది నాలుగు కోట్ల ప్రజల జాగీరు” అంటూ ఆయన ఘాటుగా కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్, ఇక్కడికి వచ్చి చేసేదేమీ లేదని ఎద్దేవా చేశారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని తన నివాసంలో పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం తీవ్రంగా తప్పుబట్టారు. పవన్ ఒక ‘పెయిడ్ ఆర్టిస్ట్’ అని, తన దగ్గర డబ్బులు ఉంటే ఆయనతో ఒక క్యారెక్టర్ చేయిస్తానని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి ఇచ్చిన నిధులు ఏమైనా ఆయన సొంత సొమ్మా అని ప్రశ్నించారు. అమరుడు గద్దర్కు కారు కొనిచ్చానని పవన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ, చనిపోయిన వారి గురించి మాట్లాడటం సంస్కారం కాదని, దీనిపై పవన్ వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో తాము ఆంధ్రా ప్రజలను ఎన్నడూ ఏమీ అనలేదని, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆంధ్రావాళ్లను ఏదో అన్నట్లు అబద్ధాలు చెప్తూ మరోసారి తెలంగాణపై తన అక్కసు వెళ్లగక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ ఇక్కడ మీటింగ్ పెట్టడం కావాలని గెలకడమేనని విమర్శించారు. పవన్ కళ్యాణ్ తిరిగితే చూడటానికి జనాలు వస్తారు కానీ, ఓట్లు వేయరని పొన్నం జోస్యం చెప్పారు. సినిమా నటుడిగా పవన్ ఎక్కడ తిరిగినా, ఏపీ ప్రజలు ఎప్పుడు వచ్చినా తెలంగాణ ఎల్లప్పుడూ స్వాగతిస్తుందని, కానీ రాజకీయంగా పవన్ వచ్చినా, పోయినా తమకు వచ్చే నష్టమేమీ లేదని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..