
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా మేడారంలో రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క-సారక్క జాతర, కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా.. భారతదేశంలో కుంభమేళా తర్వాత కోట్ల సంఖ్యలో భక్తులను ఆకర్షించే అతిపెద్ద ఉత్సవంగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, అలాగే విదేశాల నుంచి కూడా ఈ నాలుగు రోజుల జాతరలో పాల్గొనేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ ఏడాది జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా సాగనున్నది. అయితే జాతరకు ఒక నెల ముందు నుంచే లక్షలాది మంది మేడారానికి పోటెత్తడం విశేషం. ఈ అద్భుతమైన జాతరకు మూలమైన సమ్మక్క-సారక్కలు ఎవరు, వారి చరిత్ర ఏమిటి, ఈ పండుగ ఎలా ప్రారంభమైంది అనే వివరాలను తెలుసుకుందాం.
సమ్మక్క, సారక్కలు తల్లి-కూతుర్లు. సుమారు 700 సంవత్సరాల క్రితం, కాకతీయ రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కాలంలో, వీరు తెలంగాణలోని జగిత్యాల జిల్లా ప్రాంతానికి చెందిన గిరిజన జాతికి చెందినవారు. గిరిజనుల దొర అయిన మేడరాజు అడవిలో వేటాడుతుండగా.. ఒక పుట్టపై పులులు, సింహాలు కాపలాగా ఉన్న పసిపాప సమ్మక్కను కనుగొని.. ఆమెను పెంచుకున్నాడు. సమ్మక్క రాకతో వారి ప్రాంతంలో కరువులు, సమస్యలు తగ్గిపోయాయి. ఆమె చేతి పసరుతో రోగాలు నయమయ్యేవని ప్రతీతి. యుక్తవయస్సు వచ్చిన తర్వాత సమ్మక్కను మేడారం పాలకుడు, తన మేనల్లుడు అయిన పగిడిద్ద రాజుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి సారలమ్మ, నాగులమ్మ అనే ఇద్దరు కుమార్తెలు, జంపన్న అనే కుమారుడు కలిగారు. మేడరాజు పొలవాస ప్రాంతానికి కోయ రాజు కాగా, పగిడిద్ద రాజు మేడారం పాలకుడు.
కాకతీయ సామ్రాజ్యం విస్తరణలో భాగంగా, కాకతీయ మొదటి ప్రభువు మేడరాజు పాలించిన ప్రాంతాన్ని ఆక్రమించేందుకు దండెత్తాడు. ఈ దాడిని తట్టుకోలేక మేడరాజు తన కుమార్తె సమ్మక్క వద్ద మేడారంలో ఆశ్రయం పొందుతాడు. పగిడిద్ద రాజు కాకతీయుల సామంతుడిగా ఉంటూ, వారికి ప్రతి నెలా కప్పం కట్టేవాడు. అయితే, మూడు సంవత్సరాలుగా ఏర్పడిన కరువుల వల్ల కప్పం కట్టలేకపోవడం, మేడరాజుకు ఆశ్రయం ఇవ్వడం వంటి కారణాలతో కాకతీయులు ఆగ్రహించి మేడారంపై దండెత్తారు. కాకతీయ సైన్యాన్ని ఎదుర్కొనేంత బలం లేకపోయినా.. పగిడిద్ద రాజు, సమ్మక్క, సారక్క, వారి పిల్లలు సారలమ్మ, నాగులమ్మ, జంపన్నతో సహా కోయ ప్రజలంతా యుద్ధానికి సిద్ధమయ్యారు.
వేల సంఖ్యలో, బలమైన ఆయుధాలు, గుర్రాలు, ఏనుగులతో వచ్చిన కాకతీయ సైన్యంతో వందల సంఖ్యలో ఉన్న కోయ ప్రజలు బాణాలు, మొండి కత్తులతో భీకరంగా పోరాడారు. ఈ యుద్ధంలో పగిడిద్ద రాజు, సారలమ్మ, నాగులమ్మ వీరమరణం పొందారు. కుటుంబ సభ్యుల మరణాలను చూసిన జంపన్న.. అవమానాన్ని భరించలేక పక్కనే ఉన్న సంపెంగ వాగులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ వాగును జంపన్న వాగుగా పిలుస్తున్నారు. తన కుటుంబ సభ్యులందరూ మరణించారని తెలిసిన సమ్మక్క, ఏమాత్రం వెనుకాడకుండా కాళీమాతలా విజృంభించి శత్రువులను ఎదుర్కొంది. అయితే, వెనుక నుంచి ఒక సైనికుడు దొంగచాటున పొడిచి సమ్మక్కను తీవ్రంగా గాయపరిచాడు. రక్తం కారుతుండగానే ఆమె చిలుకల గుట్ట వైపు వెళ్లి, నెమలినార చెట్టు కింద ఉన్న పుట్ట దగ్గర కుంకుమ భరిణెగా మారి అదృశ్యమైంది.
సమ్మక్క అదృశ్యమైన తర్వాత, గిరిజన ప్రజలకు ఆకాశం నుంచి కొన్ని మాటలు వినిపించాయి. ‘ఈ గడ్డమీద పుట్టిన ప్రతి ఒక్కరూ వీరుడిలా రాజ్యాన్ని పాలించాలని, ఇక్కడ రెండు గద్దెలు కట్టి రెండేళ్లకొకసారి ఉత్సవం జరిపిస్తే వారి కోరికలు నెరవేరుస్తాను’ అని ఆ మాటల సారాంశం. ఈ మాటలను అమ్మ ఆదేశంగా భావించిన గిరిజనులు.. ఈ విషయం తెలిసిన కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు సైతం సమ్మక్క భక్తునిగా మారిపోయాడు. ఆయన గిరిజనుల కప్పాన్ని రద్దు చేసి, సమ్మక్క వెలిసిన చోట రెండు గద్దెలను కట్టించి, ప్రతి రెండేళ్లకోసారి జాతర నిర్వహణకు ప్రతాపరుద్రుడు ఆదేశించాడు.
అప్పటి నుంచి నేటికీ ప్రతి రెండేళ్లకోసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారంలో ఈ మహా జాతర జరుగుతుంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరలో అనేక సంప్రదాయాలు పాటిస్తారు. మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకొస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలోని కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఈ దేవతలను గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు.
మూడవ రోజున అమ్మవార్లు సమ్మక్క, సారక్క ఇద్దరూ గద్దెలపై కొలువుతీరి భక్తులకు దర్శనమిస్తారు. నాలుగవ రోజు సాయంత్రం వారికి ఆవాహన పలికి తిరిగి వనప్రవేశం చేయిస్తారు. ఈ పూజలను వంశపారంపర్యంగా గిరిజన పూజారులే నిర్వహిస్తారు. అమ్మవార్లకు బంగారంగా బెల్లాన్ని సమర్పించుకోవడం ఇక్కడి ప్రత్యేక ఆచారం. ఈ జాతర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల నుంచి కులమతాలకు అతీతంగా కోట్లాది మంది భక్తులను ఆకర్షిస్తూ.. సమ్మక్క-సారక్కల త్యాగాలను, గిరిజన సంస్కృతిని సజీవంగా నిలబెడుతోంది. కాకతీయుల కాలం నుంచి ఇప్పటి వరకు మేడారం జాతరకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉండటం విశేషం.