
తెలంగాణ పదో తరగతి ఫలితాల వేళ విద్యార్థుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిజానికి రిజల్ట్స్ ఆ గిరిజన తండాలో పండుగ వాతావరణం తీసుకురావాల్సింది.. కానీ అదే ఫలితాలు ఆ ఇంట్లో తీరని శోకాన్ని మిగిల్చాయి. పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమో అన్న చిన్నపాటి భయం, ఆ విద్యార్థిని తీసుకున్న క్షణికావేశపు నిర్ణయం ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. అవును మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్పల్లి తండాకు చెందిన బానోత్ సాయిప్రియ కథ వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. పరీక్షలు రాసిన నాటి నుండి సాయిప్రియలో ఒకటే ఆందోళన.. నేను పాస్ అవుతానా? ఇంట్లో వాళ్లకి ఏం ముఖం చూపించాలి?” అనే భయం ఆమెను నీడలా వెంటాడింది. చివరకు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది.
సాయిప్రియ కొత్తపల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివింది పూర్తి చేసింది. పరీక్షలు రాసిన తర్వాత ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేదని.. ఫెయిల్ అవుతానని ఆందోళన చెందింది. ఫలితాలు వస్తే తన పరిస్థితి ఏంటో అన్న భయం మితిమీరి, ఈ నెల 24న ఇంట్లో ఎవరూ లేని సమయంలో సాయిప్రియ ఆత్మహత్యకు పాల్పడింది. తీరా బుధవారం ఫలితాలు వెలువడ్డాక చూస్తే.. ఆమె 480 మార్కులతో అత్యుత్తమ గ్రేడ్ సాధించింది. ఆమె గెలిచింది కానీ, ఆ విజయాన్ని చూసేందుకు తనే లేకుండా పోయింది. మరో వారం రోజులు ధైర్యంగా ఉండి ఉంటే తన తల్లిదండ్రుల కళ్లలో ఆనందాన్ని చూసేదని స్థానికులు అంటున్నారు. కానీ, ఫలితాల కంటే ముందే ప్రాణాలు తీసుకోవడంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా మారింది. “చదువుకోమన్నాం కానీ, ప్రాణాలు తీసుకోమని చెప్పలేదు కదా తల్లి” అంటూ వారు రోదిస్తున్న తీరు స్థానికుల హృదయాలను కలచివేస్తోంది.
వనపర్తి జిల్లా సోళీపూర్ గ్రామంలో మరో విషాదం చోటుచేసుకుంది. చింతకాయల భరత్ అనే విద్యార్థి పదో తరగతిలో 441 మార్కులు సాధించి, ఆ సంతోషాన్ని తల్లిదండ్రులతో పంచుకున్నాడు. సరదాగా స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు వెళ్లిన భరత్, మైదానంలోనే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. తీవ్రమైన ఎండలు, వడదెబ్బ కారణంగానే అతను మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కొడుకు పాసయ్యాడన్న ఆనందం ఆ తల్లిదండ్రులకు గంట సేపు కూడా మిగల్లేదు.