
మంచి చదువు.. మంచి ఉద్యోగం.. చేతినిండా సంపాదన.. హ్యాపీ లైఫ్.. కానీ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ మోజులో పడి నష్టపోయాడు. అప్పులు, నష్టాలు వెంటాడటంతో ఏం చేయాలో దిక్కుతోచలేదు. చివరకు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. పట్టపగలే ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతూ.. దోచుకున్న సొమ్మును మళ్లీ బెట్టింగ్లో పెట్టాడు. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం జువ్విగూడెంకు చెందిన అలుగుబెల్లి రాము ఉన్నత చదువులు చదివాడు. హైదరాబాద్లో ఎంబీఏ పూర్తి చేసి మార్కెటింగ్ మేనేజర్గా ఉద్యోగం చేశాడు. మంచి ఉద్యోగం.. మంచి ఆదాయం.. ఎన్నో ఆశలతో జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. మొదట సరదాగా మొదలైన ఆన్లైన్ బెట్టింగ్ క్రమంగా అలవాటుగా మారింది. గెలుపు కోసం మళ్లీ మళ్లీ డబ్బులు పెట్టాడు. అలా రూ.60 లక్షల వరకు నష్టపోయాడు. డబ్బు పోయింది.. నష్టాలు పెరిగాయి.. చివరకు ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఓడిన కొద్దీ తిరిగి గెలిచి నష్టాన్ని పూడ్చుకోవాలనే ఆలోచన పెరిగింది. డబ్బు అవసరం పెరగడంతో అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. పట్టపగలే తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించేవాడు. ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి బంగారు, వెండి ఆభరణాలు, నగదు దొంగతనాలు చేసేవాడు. అయితే అక్కడితో ఆగలేదు.. దొంగతనాల్లో వచ్చిన డబ్బును కూడా తిరిగి ఆన్లైన్ బెట్టింగ్లో పెట్టాడు. అతడి జీవితంలోకి వచ్చిన ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ అన్నింటినీ తలకిందులు చేసింది.
ఒక్కటి కాదు.. రెండు కాదు.. రాము ఇప్పటివరకు తొమ్మిది దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వరుస దొంగతనాలపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు చివరకు రాముని అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి 16 తులాల బంగారు ఆభరణాలు,16 తులాల వెండి వస్తువులు, రూ.2.50 లక్షల నగదు, బైక్ ను స్వాధీనం చేసుకున్నామని నల్లగొండ డిఎస్పి శివరాంరెడ్డి తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్ అతడి చేతిలో గేమ్గా మొదలై.. చివరకు అతడి జీవితాన్నే గేమ్ ఓడించింది. చదువు ఉన్నా.. ఉద్యోగం ఉన్నా.. భవిష్యత్పై ఎన్నో ఆశలు ఉన్నా.. ఒక్క వ్యసనం జీవితాన్ని ఎంతలా నాశనం చేయగలదో ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.