
నల్లగొండ జిల్లా తిప్పర్తికి చెందిన దుర్గ భవానికి రెండేళ్ల క్రితం సూర్యాపేటకు చెందిన సంతోష్ తో వివాహమైంది. వీరికి ఐదు నెలల కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో తన కొడుకుని తీసుకుని తిప్పర్తిలోని పుట్టింట్లో దుర్గ భవాని ఉంటోంది. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలతో ఐదు నెలల చిన్నారిని వదిలించుకోవాలని దుర్గ భవాని నిర్ణయించుకుంది. ఇందుకోసం కొడుకుని తీసుకొని దేవరకొండకు వచ్చింది. ఇదే సమయంలో దేవరకొండ అటవీశాఖ అధికారులు డిండి రోడ్డు వైపు వెళ్తున్నారు. టీ తాగేందుకు తాటి కోల్ ఎక్స్ రోడ్డు వద్ద తమ వాహనాన్ని రోడ్డు పక్కన ఆపారు. ఈ క్రమంలో దుర్గ భవాని తన ఐదు నెలల బాబునీ అటవీ శాఖ జీపు సీట్లో పడుకోబెట్టి వెళ్ళింది. టీ తాగి జీపు దగ్గరికి వచ్చిన అటవీ అధికారులకు జీపులో శిశువు ఏడుస్తూ కనిపించడంతో షాక్ తిన్నారు.
దీంతో అటవీశాఖ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హోటల్ సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించడంతో పాటు సంఘటనా స్థలానికి సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న దుర్గ భవానికి అదుపులోకి తీసుకున్నారు. భవానిని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి విచారించగా పసి బాలుడు తన బిడ్డేనని అంగీకరించింది. భర్తతో కలిసి సూర్యాపేటలో ఉంటానని, తమ మధ్య వివాదాలు తలెత్తడంతో కొంతకాలంగా తిప్పర్తిలోని తన పుట్టింట్లో ఉంటున్నట్లు భవాని చెప్పింది.
శిశువును వదిలి వెళ్లాలన్న ఆలోచనతో దేవరకొండకు వచ్చి జీపులో వదిలిపెట్టినట్లు ఆమె చెప్పింది. ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణలో బాలుడు క్షేమంగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. భార్య భర్తలు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తామని పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..