Lok Sabha Election: పార్లమెంట్ ఎన్నికల వేళ కుగ్రామం కఠిన‌ నిర్ణయం.. నేతలకు షాక్ ఇస్తూ తీర్మానం

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాజారం గ్రామం. వందకు పైగా గడపలున్న గ్రామం. వ్యవసాయమే ఆధారంగా ఇక్కడి ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు ఈ గ్రామస్తులంతా కలిసి సమిష్టి తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడమే..!

Lok Sabha Election: పార్లమెంట్ ఎన్నికల వేళ కుగ్రామం కఠిన‌ నిర్ణయం.. నేతలకు షాక్ ఇస్తూ తీర్మానం
Boycott Polling,

Edited By:

Updated on: Apr 23, 2024 | 1:58 PM

గోదావరి పరివాహక ప్రాంతానికి అనుకొని ఉన్న కుగ్రామం అది. ప్రభుత్వాలు మారిన రాష్ట్రాలు, మండలాలు మారినా ఆ గ్రామంలో మాత్రం చూద్దామన్నా అభివృద్ది‌ సాగడం లేదు. కనీస మౌలిక వసతులు కూడా లేక నానా ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు వారంతా. పాలకులు, అధికారులకు తమ గ్రామం గోడు చెప్పుకుని అలసిపోయిన గ్రామస్తులు తాజాగా ఓ కఠి‌న నిర్ణయం తీసుకున్నారు. తమ గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడని అధికారులకు, ప్రజాప్రతినిధులకు షాక్ ఇచ్చేలా సమిష్టి నిర్ణయం తీసుకున్నారు‌. ఇప్పుడు ఈ నిర్ణయమే ఆ గ్రామాన్ని వార్తల్లో నిలిపింది.

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాజారం గ్రామం. వందకు పైగా గడపలున్న గ్రామం. వ్యవసాయమే ఆధారంగా ఇక్కడి ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు ఈ గ్రామస్తులంతా కలిసి సమిష్టి తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడమే..!

దశాబ్దానికి పైగా తమ గ్రామంలో మౌలిక వసతుల కల్పన లేదని, తాజాగా గెలిచిన కాంగ్రెస్ కూడా తమ గ్రామాన్ని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓట్లప్పుడు తప్ప మరెప్పుడు మా గ్రామానికి ప్రజాప్రతినిధుల అవసరం పడటం లేదని గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఇక అలా అయితే కుదరదని ఎన్నికలకు దూరంగా ఉంటేనే తమను‌ అధికారులు గుర్తిస్తారేమో అన్న నిర్ణయానికి వచ్చింది రాజారాం గ్రామం.

తమ గ్రామ సమస్యలను తీర్చే వరకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా ఓటెయ్యబోమని తీర్మానం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు ఇక్కడి ప్రజలు. పాలకులు మారిన ప్రభుత్వాలు మారినా మా తల రాతలు మాత్రం మారడం లేదని గ్రామస్తులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ‌ ఈ కఠన నిర్ణయం తీసుకున్నారు. సుమారు వెయ్యి మంది ఓటర్లు కలిగిన ఈ గ్రామంలో ప్రతీ ఎన్నికల ముందు గ్రామంలో నెలకొన్న సమస్యలపై నాయకుల దృష్టికి తీసుకెళ్లినా, తీరు మారలేదు. ఇచ్చిన హామీలు నీటి మీద రాతలుగానే మిగిలాయని వారు స్పష్టం చేశారు.

ప్రధానంగా గ్రామంలో తాగునీరు లేక అల్లల్లాడుతున్నారు. రవాణా మార్గం సరిగా లేక తాము నరకయాతన పడుతున్నామని గ్రామస్తులు పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడితే తమ సమస్యలు తీరుతాయని ఎంతో ఆశతో ఉన్న మాకు ఆశలు అడియాశలుగానే మిగిలాయని వారు తెలిపారు. తమ గ్రామంలో నెలకొన్న సమస్యలను తీర్చే వరకు తాము వెనుకడుగు వేయబోమని ఇకనైనా పాలకులు,అధికార యంత్రాంగం స్పందించి తమ సమస్యలను తీర్చాలని గ్రామస్తులు వేడుకొంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…